స్టీల్ప్లాంటు వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - May 20 , 2025 | 01:34 AM
స్టీల్ప్లాంటు గేటు వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నేడు కార్మికుల సమ్మె నేపథ్యంలో నేతలపై పోలీసుల ఆంక్షలు
అడ్డుకున్న పోలీసులు
ఇరువర్గాల మధ్య తోపులాట
నాయకుల అరెస్టు
రహదారిపై బైఠాయించిన మిగిలిన కార్మికులు
ఉక్కుటౌన్షిప్, మే 19 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ప్లాంటు గేటు వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం కార్మికుల సమ్మె నేపథ్యంలో సోమవారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అనుమతి లేకపోవడంతో సభను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డుపక్కన నిల్చుని కార్మిక నాయకులు నినాదాలు చేయగా, పోలీసులు వారించారు. ఈ క్రమంలో కార్మిక నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కార్మిక సంఘ నాయకులను అరెస్టు చేసి స్టీల్ప్లాంటు స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ప్రచారం చేసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం తగదంటూ కార్మికులు రోడ్డుపై భైఠాయించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ వచ్చి కార్మిక నాయకులకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపేశారు.
పోలీసులు తీరు సరికాదు...
సమ్మె ప్రాధాన్యంపై ప్రచారం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, 78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారావు ఆరోపించారు. కార్మిక నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇది మంచి పద్ధతి కాదని, శాంతియుతంగా చేస్తే ఇబ్బందులు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు.