టీచర్లు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:22 PM
ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని విద్యాశాఖ ఆర్జేడీ కె.విజయభాస్కర్ హెచ్చరించారు.
విధుల పట్ల అలసత్వం వద్దు
విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్
సీతగుంట జడ్పీ హైస్కూల్ సందర్శన
పెదబయలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని విద్యాశాఖ ఆర్జేడీ కె.విజయభాస్కర్ హెచ్చరించారు. ఆయన బుధవారం మండలంలో పర్యటించారు. స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సీతగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థుల నోటు పుస్తకాలు పరిశీలించి, వారి పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. కొన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు వేశారు. విద్యార్థుల నుంచి సరైన జవాబులు రావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బోధన, పాఠశాలలో మౌలిక సదుపాయాలపై తగిన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఎంఈవో-2 పుష్పజోసెఫ్, విద్యాశాఖ సిబ్బంది ఉన్నారు.