కోనాం సంతలో తగ్గిన చింతపండు ధర
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:15 AM
మండలంలోని కోనాం సంతలో గురువారం చింతపండు ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారంతో పోలిస్తే సగానికి తగ్గడంతో గిరిజన రైతులు తీవ్ర నిరాశ చెందారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ వేచిచూసినా ఆశించిన ధర లభించకపోవడంతో పలువురు గిరిజనులు సంతకు తెచ్చిన చింతపండును తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
గత వారంతో పోలిస్తే సగానికి పడిపోయిఇన రేటు
ఎక్కువ సరకు రావడం, వర్షానికి తడవడంతో కొనుగోలుకు ఆసక్తి చూపని వ్యాపారులు
ఇళ్లకు తీసుకెళ్లిపోయిన పలువురు రైతులు
చీడికాడ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోనాం సంతలో గురువారం చింతపండు ధర ఒక్కసారిగా పడిపోయింది. గత వారంతో పోలిస్తే సగానికి తగ్గడంతో గిరిజన రైతులు తీవ్ర నిరాశ చెందారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ వేచిచూసినా ఆశించిన ధర లభించకపోవడంతో పలువురు గిరిజనులు సంతకు తెచ్చిన చింతపండును తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. గత ఏడు వారాల నుంచి చింతపండు ధర పెరుగుతూ వుండడంతో ఈ వారం మరింత ఎక్కువ ధర లభిస్తుందన్న ఉద్దేశంతో పలువురు రైతులు పెద్ద మొత్తంలో చింతపండు తీసుకువచ్చారు. దీనికితోడు బుధవారం మధ్యాహ్నం ఆయా గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో చింతబొట్టలు తడిసిపోయారు. దీంతో చింతపండు పాడైపోతుందేమోనన్న ఉద్దేశంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందూవెనుకా ఆలోచించారు. గత వారం 20 కిలోలు కావిడి రూ.1,600 నుంచి రూ.1,700 పలకగా, ఈ వారం అదే చింతపండు రూ.800 నుంచి రూ.900లకు పడిపోయింది. అయితే కోనాంకు సుదూరంలో వున్న హుకుంపేట, అనంతగిరి మండలాలకు చెందిన గిరిజనులు, వ్యాపారులు అడిగిన ధరకు చింతపండు విక్రయించారు. కోనాం సంతకు పది కిలోమీటర్ల పరిధిలో వున్న గ్రామాల రైతులు మాత్రం చింతపండు తిరిగి తీసుకువెళ్లిపోయారు.