పర్యాటక రంగం అభివృద్ధికి సర్వే
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:39 AM
దేశ ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. పర్యాటక రంగం అభివృద్ధి, సందర్శనీయ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సర్వే చేయిస్తున్నది. జాతీయ గృహ ప్రయాణ సర్వే (ఎన్హెచ్టీఎస్) పేరుతో ఉమ్మడి విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం జిల్లాలో ఎంపిక చేసిన 186 ప్రాంతాలలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. వీటిలో 80 పట్టణ ప్రాంతాలు, 106 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో ఎంపిక చేసిన 186 ప్రాంతాల్లో ఇంటింటా వివరాల సేకరణ
ప్రజల ప్రయాణాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనపై ఆరా
నర్సీపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. పర్యాటక రంగం అభివృద్ధి, సందర్శనీయ ప్రదేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సర్వే చేయిస్తున్నది. జాతీయ గృహ ప్రయాణ సర్వే (ఎన్హెచ్టీఎస్) పేరుతో ఉమ్మడి విశాఖ, విజయగనరం, శ్రీకాకుళం జిల్లాలో ఎంపిక చేసిన 186 ప్రాంతాలలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. వీటిలో 80 పట్టణ ప్రాంతాలు, 106 గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. గురువారం నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో జూనియర్ గణాంక అధికారి దేవిశేఖర్, సర్వే ఎన్యుమరేటర్ టి.శంకరరావు ఇంటింటికి వెళ్లి డిజిటల్ సర్వే చేశారు. ఈ ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణం చేశారా? ఎప్పుడెప్పుడు ప్రయాణం చేస్తుంటారు? ప్రయాణం ఎందుకు చేశారు? పర్యాటక ప్రదేశాలను సందర్శించారా? రవాణా సదుపాయాలు ఏమిటి? వంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. సేకరించిన సమాచారాన్ని ట్యాబ్లో నమోదు చేస్తున్నారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భావిస్తున్నారు. జాతీయ గణాంక అధికారి పర్యవేక్షణలో ఎంపిక చేసిన పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఏడాది జూన్ వరకు సర్వే జరుగుతుందని అధికారులు చెప్పారు..