డ్రోన్లతో నిఘా
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:05 AM
నగర పోలీసులు నిఘా కోసం ఇకపై మరిన్ని డ్రోన్లను వినియోగించనున్నారు. ఇప్పటికే రెండు అందుబాటులో ఉండగా, సీఎస్ఆర్ కింద మరో ఆరు డ్రోన్లను సమకూర్చుకున్నారు. ఒక్కో సబ్ డివిజన్కు ఒక్కొక్కటి, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలకు చెరొకటి కేటాయించారు. ఆయా డ్రోన్ల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్ల వినియోగంపై నలుగురు కానిస్టేబుళ్లు కొన్నాళ్ల కిందట విజయవాడ వెళ్లి వారం రోజులపాటు శిక్షణ పొందారు.

ఇప్పటికే రెండు వినియోగం
మరో ఆరింటిని సమకూర్చుకున్న పోలీసులు
ఒక్కో సబ్ డివిజన్కు ఒక్కొక్కటి కేటాయింపు
ట్రాఫిక్, క్రైమ్ విభాగాలకు చెరొకటి...
ప్రస్తుతం వినియోగంపై శిక్షణ
ఆకతాయిల ఆగడాలకు,
నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట
విశాఖపట్నం, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీసులు నిఘా కోసం ఇకపై మరిన్ని డ్రోన్లను వినియోగించనున్నారు. ఇప్పటికే రెండు అందుబాటులో ఉండగా, సీఎస్ఆర్ కింద మరో ఆరు డ్రోన్లను సమకూర్చుకున్నారు. ఒక్కో సబ్ డివిజన్కు ఒక్కొక్కటి, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలకు చెరొకటి కేటాయించారు. ఆయా డ్రోన్ల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. డ్రోన్ల వినియోగంపై నలుగురు కానిస్టేబుళ్లు కొన్నాళ్ల కిందట విజయవాడ వెళ్లి వారం రోజులపాటు శిక్షణ పొందారు. వారి ద్వారా నగరంలో 55 మందికి శిక్షణ ఇప్పించాలని సీపీ శంఖబ్రతబాగ్చి నిర్ణయించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్తోపాటు క్రైమ్ విభాగాల నుంచి 55 మందిని ఎంపిక చేసి వారికి దఫదఫాలుగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. డ్రోన్లను ఎలా ఎగురవేయాలి, వాటి ద్వారా రికార్డింగ్ ఎలా చేయాలి, డ్రోన్లను తిరిగి ల్యాండింగ్ ఎలా చేయాలి?...అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. బుధవారం జగదాంబ జంక్షన్లో జనం రద్దీగా ఉన్నప్పుడు డ్రోన్లను వినియోగించడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. త్వరలోనే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, క్రైమ్ బీట్ కానిస్టేబుళ్లు సైతం వినియోగించేలా చిన్నపాటి డ్రోన్లను సమకూర్చుకోవాలని సీపీ నిర్ణయించినట్టు తెలిసింది. డ్రోన్లు అందుబాటులోకి వస్తే ఆకతాయిల ఆగడాలతోపాటు నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, జూదం వంటి వాటికి అడ్డుకట్ట వేయడం సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు.