రైతుకు అండగా!
ABN , Publish Date - May 10 , 2025 | 12:14 AM
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. సూపర్ సిక్స్లో ఒకటైన ‘ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం’ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం పేరుతో అర్హులైన రైతులకు మూడు విడతల్లో సాయం అందజేయనున్నది. ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది.

అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం
కౌలుదారులకు, అటవీ భూముల హక్కు పత్రాలు ఉన్న రైతులకూ వర్తింపు
ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు సాయం
వ్యవసాయ శాఖకు మార్గదర్శకాలు
రైతు సేవా కేంద్రాల్లో వివరాలు నమోదు
ఈనెల 20వ తేదీ వరకే గడువు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. సూపర్ సిక్స్లో ఒకటైన ‘ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం’ హామీని అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం పేరుతో అర్హులైన రైతులకు మూడు విడతల్లో సాయం అందజేయనున్నది. ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందనున్నది.
అందరికీ అన్నం పెట్టే రైతులకు పెట్టుబడి నిధి కింద ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏడాదిలో మూడు విడతలుగా రూ.20 వేల సాయం అందించనుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు జారీ కావడంతో లబ్దిదారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. భూమి ఉన్న రైతులతోపాటుకౌలు రైతులకు, అటవీ భూములపై హక్కులున్న వారికి కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ’పీఎం కిసాన్’ పేరుతో ఒక్కో రైతుకు ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు అందిలా చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను పరిశీలించి, అర్హుల జాబితాలను రూపొందిస్తున్నారు. అర్హుల జాబితాను ఈ నెల 20వ తేదీలోగా వ్యవసాయ శాఖ వెబ్సైట్లో పొందుపరచనున్నారు.
జిల్లాలో రెండు లక్షలకుపైగా రైతులకు లబ్ధి
జిల్లాలో మొత్తం 4.2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న 1,95,558 మందికి ఆర్థిక సాయం అందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం వీరందరికీ వర్తించనున్నది. అయితే పీఎం కిసాన్ యోజనలో కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడంలేదు. వీరితోపాటు అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారుల సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం వుంది. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 80 వేల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా. వీరిలో క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ (సీసీఆర్సీ) ఉన్న కౌలు రైతులకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. అటవీ హక్కు పత్రాలు పొంది పంటలు సాగు చేస్తున్న గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, దేవరాపల్లి, మాడుగుల మండలాల్లోని గిరిజన రైతులకు కూడా ఈ పథకం కింద సాయం అందుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో రెవెన్యూ, వ్యవసాయ, అటవీ శాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. గ్రామస్థాయిలో వ్యవసాయ శాఖ సహాయకులు, వీఆర్ఓలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. దీనిని మండల వ్యవసాయాధికారి, తహసీల్దారు ఆమోదిస్తే.. జిల్లా వ్యవసాయాధికారి పరిశీలించి వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్ పోర్టల్లో ఈ నెల 20 వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలు
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. భార్య, భర్త, అవివాహితులను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు మల్బరీ (పట్టు) తోటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే. ప్రస్తుత లేదా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో వున్న వారికి ఈ పథకం వర్తించదు. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు కూడా పథకానికి అర్హులు కారు. నెలకు రూ.10 వేలు అంతకు మించి పెన్షన్ తీసుకొనే వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు అనర్హులు. గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారు ఈ పథకం కింద లబ్ధి పొందలేరు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా కూడా ఈ పథకం వర్తించదు. అర్హులై వుండి అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందాలనుకొనే రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని జిల్లా వ్యవసాయధికారి బి.మోహన్రావు ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 20 వరకే గడువు ఉన్నందున రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.