ఫ్రైడే!
ABN , Publish Date - May 17 , 2025 | 12:15 AM
భానుడు ఠారెత్తించడంతో శుక్రవారం నగరవాసులు విలవిల్లాడిపోయారు. ఉదయం ఏడు గంటల నుంచి సూరీడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించేశాడు.
ఠారెత్తించిన భానుడు
ఉక్కపోత, వేడితో ఆపసోపాలు పడిన నగరవాసులు
విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):
భానుడు ఠారెత్తించడంతో శుక్రవారం నగరవాసులు విలవిల్లాడిపోయారు. ఉదయం ఏడు గంటల నుంచి సూరీడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించేశాడు. ఎండ తీవ్రత సాయంత్రం ఐదున్నర వరకు కొనసాగడంతో ప్రజలు బయటకు రావడానికే భీతిల్లిపోయారు. భగభగలాడిన ఆదిత్యుడి డెబ్బకు నగరంలోని రహదారులపై వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో మధ్యాహ్న సమయానికి అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారంతా ఎండ దెబ్బకు బెంబేలెత్తిపోయారు. ఎండతోపాటు ఉక్కపోత కూడా ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు సైతం అల్లాడిపోయారు. భానుడి తాపం నుంచి కాస్తయినా ఉపశమనం పొందేందుకు అత్యధికులు చల్లని పానీయాలను తాగేందుకు ఆసక్తి చూపారు. వాహనదారులు, పాదచారులు ఎండదెబ్బ తగలకుండా ఉండేందుకు గొడుగులు, ముఖానికి క్లాత్లు, మహిళలు, యువతులు చున్నీలు వంటిని కప్పుకుని కనిపించారు.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భానుడి ప్రతాపానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యవసరమైతే తప్పా బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. ఉదయం 11 గంటల తరువాత నుంచి పలుచోట్ల వేడి గాలులు వీయడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు నానాపాట్లు పడ్డారు. ఎండ వేడిమి నుంచి సేదతీరేందుకు ఫ్యాన్లు, ఏసీలను ఎక్కువగా వినియోగించారు. ఆరుబయట పనిచేసేవాళ్లు చెట్ల కిందకు చేరిపోయి ఉపశమనం పొందే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ, వేడి గాలుల నుంచి సేదతీరేందుకు సాయంత్రం ఐదు గంటల తరువాత అధిక శాతం మంది సాగరతీరాలకు చేరుకున్నారు. పలువురు సముద్రంలో స్నానాలు చేస్తూ గడిపారు.
ఇక బస్టాపుల్లోనే పార్శిళ్ల బుకింగ్
లాజిస్టిక్ విధానంలో కొత్త విధానానికి ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం
జూన్ 1 నుంచి అందుబాటులోకి..
తొలుత దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో అమలు
యూటీఎస్ టెక్నాలజీ వినియోగంపై బస్సు డ్రైవర్లకు శిక్షణ
ద్వారకాబస్స్టేషన్, మే 16 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ లాజిస్టిక్స్లో పార్శిళ్లు బుక్ చేయాలంటే ఆయా బుకింగ్ కేంద్రాలకు లేదా ఆథరైజ్డ్ ఏజెన్సీల కార్యాలయాలకు వెళ్లాలి. ఇప్పటివరకు పార్శిళ్ల బుకింగ్ విధానం ఇలాగే జరుగుతుంది. అయితే ఇది వినియోగదారులకు కాస్త అసౌకర్యంగా ఉంటుంది. దీనిని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం పార్శిళ్ల బుకింగ్ విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుడుతుంది. వినియోగారులకు అందుబాటులో ఉండే బస్టాపుల్లోనే పార్శిళ్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తుంది. సంబంధిత బస్సుల డ్రైవర్లే పార్శిళ్లను బుక్ చేసుకుని, అందుకు సంబంధించిన రశీదును కూడా ఇస్తారు. అదే బస్సు లైవ్ ట్రాకింగ్లో ఉంటుంది కాబట్టి తమ పార్శిల్ రవాణా సమయాన్ని వినియోగదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకు సంబంధించి యూనిఫైడ్ టికెట్ సొల్యూషన్ (యూటీఎస్) మిషన్ పేరిట సాఫ్ట్వేర్ను సిద్ధం చేసిందది. ఈ యూటీఎస్ వినియోగంపై డ్రైవర్లకు శిక్షణ కూడా ఇస్తోంది.
తొలుత దూర ప్రాంత సర్వీసుల్లో..
ఈ విధంగా పార్శిళ్ల బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రాథమికంగా దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో అమలు చేయాలని ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం నిర్ణయించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, భీమవరం, ఖమ్మం, కర్నూలు, చిత్తూరు వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జోనల్ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, పలాస, ఇచ్ఛాపురం, శ్రీకాకుళానికి రాకపోకలు సాగించే బస్సుల్లో, జోనల్ పరిధిలోని నాన్స్టాప్, సింగిల్ స్టాప్ సర్వీసుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బస్సులు ఆగే అన్ని కేంద్రాల్లోనూ డ్రైవర్లు పార్శిళ్లను బుక్ చేసుకుంటారు.
డ్రైవర్లకు శిక్షణ
యూటీఎస్ మిషన్ను వినియోగించే విధానంపై ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. మొదటి దశలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే డ్రైవర్లకు శిక్షణను అందిస్తున్నారు. రీజియన్ పరిధిలోని మధురవాడ, విశాఖపట్నం, మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం, గాజువాక, స్టీల్ సిటీ డిపోల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 50 మంది వరకు డ్రైవర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు.
వచ్చేనెల ఒకటి నుంచి అమలులోకి..
ఈ విధానం వచ్చేనెల ఒకటి నుంచి అమలులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. తొలుత హైదరాబాద్, విజయవాడ, భీమవరం, చెన్నై బస్సుల్లో అమలు చేసి, ఆ తరువాత దశలవారీగా అన్ని దూర ప్రాంత సర్వీసుల్లో, జోనల్ పరిధిలో తిరిగే బస్సుల్లోనూ అమలు చేస్తారు. దీనివల్ల పార్శిళ్లు బుకింగ్ చేసుకునే వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది.
పెరిగిన విద్యుత్ వినియోగం
అంతరాయం లేకుండా సరఫరా
ప్రతి శుక్రవారం నిర్వహణ పనులు
విశాఖలో లోడ్ మానిటరింగ్ సెల్
ఈపీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాశ్
విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):
వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఈపీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టీవీ సూర్యప్రకాశ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వేసవి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని కొరత రాకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఊహించని ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లకు ప్రతి శుక్రవారం నిర్వహణ పనులు చేపడుతున్నామని, అందులో భాగంగా శుక్రవారం కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడిందన్నారు.
అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల గురువారం రాత్రి పెనుగాలులతో వర్షం కురిసిందని, దీంతో మాడుగుల మండలం సత్యవరంలో 20 ఎల్టీ స్తంభాలు, ఏడు హెచ్టీ స్తంభాలు విరిగి పడిపోయాయని ఆయన చెప్పారు. డి.గొట్టివాడ, సాగరం, కొత్తవలస, కె.వేలంపాడు గ్రామాల్లో 1,600 సర్వీసులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి శుక్రవారం ఉదయం పది గంటలోకల్లా సరఫరాను పునరుద్ధరించామన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలోని శాలిపేటలో గురువారం రాత్రి పది గంటల సమయంలో భారీ లోడుతో వెళుతున్న వాహనం స్తంభాలను లాగేసిందని, దాంతో ఆరు ఎల్టీ స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ కారణంగా గజపతినగరం, మెంటాడ మండలాల్లో 264 సర్వీసులకు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించామన్నారు.
విశాఖలో లోడ్ మానిటరింగ్ సెల్
విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలను గుర్తించేందుకు విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షిస్తున్నామని సూర్యప్రకాశ్ చెప్పారు. డివిజన్ స్థాయిల్లో సైతం ఇలాంటి మానిటరింగ్ సెల్స్ పనిచేస్తున్నాయని, విద్యుత్ సమస్యలు ఏమున్నా 1912 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని ఆయన సూచించారు.