కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ క్యాన్తో ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:26 AM
అనకాపల్లి గవరపాలేనికి చెందిన బుద్ద శ్రీనివాసరావు అనే రైతు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఒంటి మీద పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే వున్న పోలీసులు వెంటనే నిలువరించారు.
అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి గవరపాలేనికి చెందిన బుద్ద శ్రీనివాసరావు అనే రైతు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఒంటి మీద పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే వున్న పోలీసులు వెంటనే నిలువరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనకున్న ఎనిమిది సెంట్ల భూమిని కుటుంబీకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చానని తెలిపారు. కాగా అక్కడ వున్న పోలీసులు ఇతని తెలుసుకొని రెవెన్యూ అధికారులకు తెలియజేయగా కలెక్టరేట్ విభాగం డీటీ వచ్చి, బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని డీటీ హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు శ్రీనివాసరావుకు నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు.