కూటమిలో ఆధిపత్య పోరు
ABN , Publish Date - May 22 , 2025 | 01:27 AM
కూటమిలోని టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిత్రపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది. తొలుత టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు/పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే (జనసేన) చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని, పార్టీ ఇన్చార్జికి విలువ ఇవ్వడం లేదన్నారు. తమ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.
మంత్రి నారాయణ సమక్షంలో
జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట
తమ మాటకూ విలువ ఇవ్వాలని కోరిన
టీడీపీ ఇన్చార్జులు
ఎమ్మెల్యేదే తుది నిర్ణయమని
స్పష్టం చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కూటమిలోని టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిత్రపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది. తొలుత టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు/పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే (జనసేన) చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని, పార్టీ ఇన్చార్జికి విలువ ఇవ్వడం లేదన్నారు. తమ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేను ‘నువ్వు’ సంబోధించడంతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ (జనసేన) జోక్యం చేసుకొని మర్యాదగా మాట్లాడాలని సూచించారు. అంతలో ఎలమంచిలి టీడీపీ నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు కల్పించుకొని తమ దగ్గర కూడా సమస్యలు ఉన్నాయని ప్రస్తావించారు. దీంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ, ‘ఇది ఎమ్మెల్యేల సమావేశమా?, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జుల సమావేశమా?, అలాగైతే కూటమిలోని అన్ని పార్టీల ఇన్చార్జులను కూడా సమావేశానికి ఆహ్వానించాలి కదా?, ఒక్క టీడీపీ వారినే పిలవడం ఏమిటి?’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుందరపు మాట్లాడుతూ, ఎలమంచిలిలో ‘50 శాతం ఎమ్మెల్యే’ తానేనంటూ ప్రగడ నాగేశ్వరరావు అధికారులను తన వద్దకు రావాలని బెదిరిస్తున్నారని, ఆయన ప్రతిపాదించిన అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని...ఇలా ‘50 శాతం ఎమ్మెల్యే’లు ఎక్కడైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ దశలో గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు కల్పించుకొని చేసిన సేవలను గుర్తించి కొందరికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించామని, వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే మరికొందరికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, వారు ఏదైనా అంశంపై సలహాలు మాత్రం ఇవ్వవచ్చునన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతుందని స్పష్టంచేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడిగా పల్లా శ్రీనివాసరావు స్పష్టత ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాలో ఇకపై విభేదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.