Share News

వీధి కుక్కల దాడి

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:22 AM

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం సుమారు 30 మంది కుక్కకాటు బాధితులు క్యూ కట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం ఒక్కరోజే ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేట, తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు కుక్కల దాడిలో గాయపడి ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు.

వీధి కుక్కల దాడి
కుక్క దాడి చేయడంతో గాయపడిన గౌరినాయుడు

30 మందికి గాయాలు

కృష్ణాదేవిపేట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం సుమారు 30 మంది కుక్కకాటు బాధితులు క్యూ కట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం ఒక్కరోజే ఏఎల్‌పురం, పాతకృష్ణాదేవిపేట, తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు కుక్కల దాడిలో గాయపడి ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు. ఏఎల్‌పురం గ్రామానికి చెందిన పైల గౌరినాయుడు, సత్యనారాయణ, వి.లత, ఎస్‌.మూర్తి, రమణమ్మ, సరస్వతి, అప్పికొండ, గణదీప్‌, చినబాబులు, పాతకృష్ణాదేవిపేటకు చెందిన నూకరత్నం, రమణబాబు తదితరులు శనివారం కుక్క కాటుకుగురయ్యారు. వీరికి వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో పైల గౌరినాయుడు ఎడమ కాలుపై పలు చోట్ల వీధి కుక్క కరవడంతో అతనిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో అధిక సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని మండల వాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:22 AM