అన్నదాతల్లో తుఫాన్ బెంగ
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:52 AM
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లాపై తుఫాన్ ప్రభావం అంతగా వుండనప్పటికీ.. వాతావరణం మారిపోవడంతో రైతులు.. ముఖ్యంగా వరి సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేపట్టగా, ఇంతవరకు సగానికిపైగా విస్తీర్ణంలో వరి కోతలు పూర్తయ్యాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఇంకా కుప్పలు వేయలేదు.
వాతావరణం మారిపోవడంతో ఆందోళన
ఆకాశం మేఘావృతంతో కోత కోసిన పొలాల్లో హడావిడిగా కుప్పలు
వరి పంట పక్వానికి వచ్చినపొలాల్లో కోతలు వాయిదా
జిల్లాపై తుఫాన్ ప్రభావం అంతగా ఉండదంటున్న అధికారులు
అనకాపల్లి/ రావికమతం, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ ప్రభావంతో శనివారం జిల్లాలోని పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమైంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అనకాపల్లి జిల్లాపై తుఫాన్ ప్రభావం అంతగా వుండనప్పటికీ.. వాతావరణం మారిపోవడంతో రైతులు.. ముఖ్యంగా వరి సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేపట్టగా, ఇంతవరకు సగానికిపైగా విస్తీర్ణంలో వరి కోతలు పూర్తయ్యాయి. వీటిల్లో ఎక్కువ శాతం ఇంకా కుప్పలు వేయలేదు. శుక్రవారం వరకు ఎండకాస్తూ పొడి వాతావరణం నెలకొనగా.. శనివారంనాటికి వాతావరణం మారిపోయి, ఆకాశం మేఘావృతమైంది. దీంతో వరి పంటను ఇప్పటికే కోతకోసిన రైతులు హడావిడిగా కుప్పలు వేయడం మొదలుపెట్టారు. దీంతో కూలీలకు గిరాకీ పెరిగి, అవసరం మేరకు లభించని పరిస్థితి ఏర్పడింది. కాగా పంట పక్వానికి వచ్చిన పొలాల్లో వరి కోతలను రెండు, మూడు రోజులపాటు వాయిదా వేసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీచి, గింజ రాలిపోయే ప్రమాదం వుందని ఆందోళన చెందుతున్నారు. అయితే తుఫాన్ ప్రభావం అనకాపల్లి జిల్లాపై ఎంతవరకు వుంటుందనే ఆదివారం సాయంత్రానికి స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.