మెయిన్రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు చర్యలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:49 AM
పలు కారణాలతో తాత్కాలికంగా ఆగిన స్థానిక మెయిన్ రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. దీంతో గుర్తించిన మెయిన్రోడ్డు ఆక్రమణదారులకు సోమవారం రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేసింది.
పలువురు ఆక్రమణదారులకు రెవెన్యూ నోటీసులు
పాడేరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): పలు కారణాలతో తాత్కాలికంగా ఆగిన స్థానిక మెయిన్ రోడ్డులో ఆక్రమణల తొలగింపునకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. దీంతో గుర్తించిన మెయిన్రోడ్డు ఆక్రమణదారులకు సోమవారం రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక గొందూరు కాలనీ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజీ వరకు రోడ్డు విస్తరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే గొందూరు కాలనీ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఆక్రమణల గుర్తింపు పూర్తికాగా, అంబేడ్కర్ సెంటర్ నుంచి మెడికల్ కాలేజీ వరకు ఉన్న ఆక్రమణలను తొలగించి, నేషనల్ హైవే అథారిటీకి అప్పగించేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. గతంలో అంబేడ్కర్ సెంటర్ నుంచి పలు ఆక్రమణలు తొలగించగా, అక్కడి నుంచి ఆక్రమణల తొలగింపు తాత్కాలికంగా ఆగింది. దీంతో సోమవారం నుంచి మళ్లీ ఆ ప్రక్రియలో భాగంగా ఆక్రమణదారులకు రెవెన్యూ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. గడువులోగా ఆక్రమణదారులు స్వయంగా తమ దుకాణాలను తొలగించుకోవాలని, లేకుంటే తామే వాటిని తొలగిస్తామని రెవెన్యూ అధికారులు సూచించారు. ఇక నుంచి దశల వారీగా మెయిన్రోడ్డులో ఆక్రమణ తొలగింపు చర్యలు కొనసాగుతాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.