పాడేరులో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:55 PM
పాడేరు డివిజన్లో ద్విచక్ర వాహనాలను నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీవో అధికారులతో కలిసి పాడేరులో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ తెలిపారు.
డీఎస్పీ షెహబాజ్ అహ్మద్
విస్తృతంగా వాహనాల తనిఖీలు
ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన
రికార్డులు లేని 11 వాహనాలు సీజ్
పాడేరురూరల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పాడేరు డివిజన్లో ద్విచక్ర వాహనాలను నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీవో అధికారులతో కలిసి పాడేరులో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ తెలిపారు. పాడేరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ట్రాఫిక్ నిబంధనలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా పాడేరు - విశాఖ ప్రధాన రహదారిలో సీఐ డి.దీనబందు, ఎస్ఐ ఎల్.సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా 200 వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో అధిక శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్లు లేనట్టు గుర్తించామన్నారు. అలాగే హెల్మెట్లు విక్రయించే షాపులు కూడా పాడేరులో లేవని గుర్తించామని, నాణ్యమైన హెల్మెట్ షాపు యజమానులతో మాట్లాడి పాడేరులో శుక్రవారం వారపు సంతరోజు అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ను కొనుగోలు చేసుకోవాలన్నారు. సెకెండ్ హ్యాండ్ బైక్లు కొనుగోలు చేసేవారు వాహన రికార్డులు అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. బాలలకు వాహనాలు ఇస్తే ఆ వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాడేరు పట్టణంలో స్పీడ్ డ్రైవింగ్, త్రిపుల్ డ్రైవింగ్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వారి స్పీడ్కు కళ్లెం వేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీపు, ఆటో చోదకులు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న షాపు యజమానులు మైదాన ప్రాంతం నుంచి వచ్చే సరకుల లోడింగ్, అన్లోడింగ్లను పగటి పూట చేపట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకపై అలా చేపడితే వాహనదారుడిపై, షాపు యజమానిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఖరీదైన ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ బైక్లు, 220 సీసీ వాహనాలు నడిపే వారిని గుర్తించారు. రూ.లక్షకు పైగా ఖరీదైన వాహనాన్ని వినియోగించే వాహనదారుల వివరాలు, వారు చేసే వృత్తి, వచ్చే ఆదాయం తదితర వాటిపై ఆయన ఆరా తీసి అటువంటి వాహన యజమానుల వివరాలు, ఆధార్ నంబర్, చిరునామాలను నమోదు చేసుకున్నారు. కాగా నిబంధనలు పాటించని 14 మంది వాహన యజమానులకు జరిమానా విధించారు. ఏ రికార్డులు లేని 11 వాహనాలను సీజ్ చేశారు.