ఉక్కు కాంట్రాక్టు కార్మికుల సమ్మె విరమణ
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:23 AM
కాంట్రాక్టు కార్మికులను స్టీల్ ప్లాంటు యాజమాన్యం అకారణంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నదని ఆరోపిస్తూ మే 20వ తేదీ నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్టు బుధవారం అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్లాంటులో ప్రస్తుత పరిస్థితులు, మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించుకుంటున్నామని పేర్కొన్నాయి. అయితే కాంట్రాక్టు కార్మికుల తొలగింపు విషయంలో పోరాటాలు చేస్తామని తెలిపాయి. ఈ నెల పదో తేదీన ఆర్ఎల్సీ సమక్షంలో జరగనున్న చర్చలకు ఉక్కు ఉన్నతాధికారులు హాజరై కార్మిక వర్గానికి మేలు చేయాలని కోరాయి.
విశాఖపట్నం/ఉక్కు టౌన్షిప్,
జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
కాంట్రాక్టు కార్మికులను స్టీల్ ప్లాంటు యాజమాన్యం అకారణంగా విధుల్లో నుంచి తొలగిస్తున్నదని ఆరోపిస్తూ మే 20వ తేదీ నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్టు బుధవారం అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్లాంటులో ప్రస్తుత పరిస్థితులు, మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించుకుంటున్నామని పేర్కొన్నాయి. అయితే కాంట్రాక్టు కార్మికుల తొలగింపు విషయంలో పోరాటాలు చేస్తామని తెలిపాయి. ఈ నెల పదో తేదీన ఆర్ఎల్సీ సమక్షంలో జరగనున్న చర్చలకు ఉక్కు ఉన్నతాధికారులు హాజరై కార్మిక వర్గానికి మేలు చేయాలని కోరాయి.
సమ్మె నిర్వీర్యానికి యాజమాన్యం కుట్ర
నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సమ్మెను అన్ని విధాలుగా నిర్వీర్యం చేయడానికి యాజమాన్యం ప్రయత్నించిందని, సహకారం, మద్దతు ప్రకటించిన నాయకులపై కేసులు పెట్టి, బెదిరించిందని ఆరోపించారు. సమ్మె సమయంలోనే 1,541 మందిని విధుల్లోకి రాకుండా ఆపేసిందన్నారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకొని పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ విశాఖపట్నం వచ్చే పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునే విధంగా, హక్కులు పరిరక్షించుకునే విధంగా కృషిచేస్తామని, ఇతర రూపాల్లో పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నుంచి పి.నగేశ్, సత్యారావు, ఉమ్మిడి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.