గర్భిణులకు అత్యాధునిక సేవలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:01 AM
నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లో నూతన సంవత్సర కానుకగా గర్భిణులకు టిఫా స్కానింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణులు, శిశు సంరక్షణ కోసం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీసీహెచ్) ఆస్పత్రులకు ప్రభుత్వం ఒక్కొక్కటి రూ.30.48 లక్షల విలువ చేసే టిఫా స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసింది. నర్సీపట్నం ఆస్పత్రికి ఇప్పటికే టిఫా స్కానింగ్ చేరుకుంది. మహిళ గర్భం దాల్చి నెలలు నిండిన తరువాత ఈ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తామని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రులకు టిఫా స్కానింగ్ యంత్రాలు
గర్భస్థ శిశువు లోపాలు గుర్తించడానికి దోహదం
ఒక్కొక్కటి రూ.30.48 లక్షలు
జనవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి సేవలు
నర్సీపట్నం/ అనకాపల్లి టౌన్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆస్పత్రుల్లో నూతన సంవత్సర కానుకగా గర్భిణులకు టిఫా స్కానింగ్ మిషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణులు, శిశు సంరక్షణ కోసం డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీసీహెచ్) ఆస్పత్రులకు ప్రభుత్వం ఒక్కొక్కటి రూ.30.48 లక్షల విలువ చేసే టిఫా స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసింది. నర్సీపట్నం ఆస్పత్రికి ఇప్పటికే టిఫా స్కానింగ్ చేరుకుంది. మహిళ గర్భం దాల్చి నెలలు నిండిన తరువాత ఈ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తామని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇది అత్యంత ఆధునిక స్కానింగ్ మిషన్ అని, 18 నుంచి 22 వారాల గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితి, లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుందని నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ శోభ తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో నెలకు సగటున 320 ప్రసవాలు జరుగుతుంటాయి. ఇందులో 65 శాతం సుఖ ప్రసవాలు, 35 శాతం సిజేరియన్లు వుంటున్నాయి. నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట, రావికమతం మండలాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నుంచి రోజూ వంద మందికిపైగా గర్భణులు గైనికాలజీ ఓపీకి వస్తుంటారు. గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి అలా్ట్ర సౌండ్ స్కానింగ్ చేస్తారు. ఏరియా ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్లో రోజుకు 40 నుంచి 50 మందికి పరీక్షలు చేస్తుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో ఏరియా ఆస్పత్రిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా టిఫా స్కానింగ్ మిషన్ మంజూరైంది. దీనిని మొదటి అంతస్థులోని స్కానింగ్ సెంటర్లో అమర్చారు. జనవరి ఒకటో తేదీ నుంచి టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని, గర్భస్థ శిశువు ఏ స్థితిలో ఉంది, ఉమ్మనీరు స్థితిని తెలుసుకొని అందుకనుగుణంగా గర్భిణులకు వైద్యం చేయానికి ఉపయోగ పడుతుందని ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు.