పీ4 ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:40 PM
పీ4లో భాగంగా బంగారు కుటుంబాలను, వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
బంగారు కుటుంబాలు, మార్గదర్శులను గుర్తించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పీ4లో భాగంగా బంగారు కుటుంబాలను, వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శులను గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. పీ4పై రంపచోడవరం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పీ4లో భాగంగా చేపట్టాల్సిన ప్రక్రియలను అధికారులు వేగవంతం చేయాలన్నారు. మండలాల వారీగా బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలను సిద్ధం చేయాలని, పీ4పై మండల స్థాయిలో మండల ప్రత్యేకాధికారులదే పూర్తి బాధ్యతని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం మండల, సచివాలయ స్థాయిలో ఆశించిన పురోగతి లేదని, చర్యలు మరింత వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. క్షేత్ర స్థాయిలో బంగారు కుటుంబాల స్థితిగతులపై పరిశీలన జరిపి వారి అవసరాలను పక్కాగా గుర్తించాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఐవీఆర్ఎస్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే.అభిషేక్గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు సింహాచలం, అపూర్వభరత్, సబ్కలెక్టర్లు శౌర్యమన్పటేల్, శుభం నొక్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, పీ4 నోడల్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.