Share News

వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:51 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

వినతుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
ఐటీడీఏ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌ కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

సమస్య పరిష్కారం కాకుంటే 1100 కాల్‌ చేయండి

పీజీఆర్‌ఎస్‌లో 86 వినతుల స్వీకరణ

పాడేరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పక్కాగా పరిశీలించి, విచారణ జరిపి శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఒకే సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో పలు మార్లు అర్జీలు పెట్టుకునే పరిస్థితులు కల్పించవద్దన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే అర్జీదారులు సమర్పించిన వినతులు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు కాల్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. అర్జీదారులు కాల్‌సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌: క్ఛ్ఛజుౌట్చఝ.్చఞ.జౌఠి.జీుఽ సంప్రదించవచ్చునని కలెక్టర్‌ పేర్కొన్నారు.

పీజీఆర్‌ఎస్‌లో 86 అర్జీలు సమర్ఫణ

స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, ఆర్‌డీవో ఎంవీఎస్‌.లోకేశ్వరరావు ప్రజల నుంచి 86 వినతులను స్వీకరించారు. తన కుమార్తె కొర్రా అపర్ణ(11)కు సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలని పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ వంకచింత గ్రామానికి చెందిన కొర్రా సురేశ్‌ కోరగా, డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ కేంద్రానికి చెందిన కొర్రా నవీన్‌కు దివ్యాంగ పెన్షన్‌ మంజూరు చేయాలని కోరారు. అలాగే అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో కొత్తగా వేలమామిడి కేంద్రంగా పంచాయతీని ఏర్పాటుచేయాలని వార్డు సభ్యుడు సీదరి శంకరరావు, గ్రామస్థులు సీదరి కృష్ణ, పాడి అప్పన్న, సీదరి సిద్దు, సుబ్బు, తదితరులు కోరగా, మూడో తరగతి చదువుతున్న తన కుమార్తె మఠం నీరజకు తల్లికి వందనం మంజూరు చేయాలని ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీకి చెందిన మఠం సీతమ్మ వినతిపత్రం సమర్పించింది. అలాగే అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ బంగారుమెట్ట నుంచి బందకొండ గ్రామానికి తారురోడ్డును నిర్మించాలని సర్పంచ్‌ అనూష, స్థానికులు కొండబాబు, వేణుగోపాల్‌, తదితరులు కోరగా, కూనవరం పంచాయతీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అంబేడ్కర్‌ విజన్‌ సంస్థ అధ్యక్షుడు రవీంద్ర ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవే పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ వీఏ.స్వామినాయుడు, డీఈవో కె.రామకృష్ణారావు, జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఆర్‌వీ.రమణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీవీ.పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, రోడ్ల, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ జి.ప్రసాద్‌, సీపీవో ప్రసాద్‌, ఎన్‌హెచ్‌ డిప్యూటీ తహశీల్దార్‌ వి.ధర్మరాజు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 10:51 PM