బాలికపై లైంగిక దాడి దురదృష్టకరం
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:58 AM
బాలికపై లైంగిక దాడి జరగడం దురదృష్టకరమని, దోషులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం
బాధితురాలికి ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందిస్తాం
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ
మహారాణిపేట, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
బాలికపై లైంగిక దాడి జరగడం దురదృష్టకరమని, దోషులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈ నెల ఏడో తేదీన పదకొండేళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కేజీహెచ్ ఆవరణలోని వన్స్టాఫ్ సఖి సెంటర్లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను ఆమె మంగళవారం పరామర్శించారు. అనంతరం చైర్ పర్సన్ శైలజ మీడియాతో మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధితురాలికి ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. బాలికను ప్రత్యేక స్కూల్లో చదివించడంతోపాటు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని ఆమె తల్లిదండ్రులను కోరారు.