ఎలమంచిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ
ABN , Publish Date - May 10 , 2025 | 12:15 AM
స్థానిక మునిసిపాలిటీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మునిసిపల్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ 16 మంది కౌన్సిలర్లు అధికారులకు నోటీసు అందజేశారు. వీరిలో చైర్పర్సన్ కాకుండా మిగిలిన వారిలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లే కావడం గమనార్హం. గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరిన చైర్పర్సన్ రమాకుమారిని పదవి నుంచి దించేయడానికి ఆ పార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే.

వైస్చైర్మన్లపై సొంత పార్టీ వారే అవిశ్వాసం
16 మంది సంతకాలతో మునిసిపల్ అధికారులకు నోటీసు
వీరిలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు!
అవిశ్వాసం నెగ్గుతుందని చైర్పర్సన్ వర్గీయుల ధీమా
రాజీనామా యోచనలో వైస్చైర్మన్లు?
ఎలమంచిలి, మే 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మునిసిపల్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ 16 మంది కౌన్సిలర్లు అధికారులకు నోటీసు అందజేశారు. వీరిలో చైర్పర్సన్ కాకుండా మిగిలిన వారిలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లే కావడం గమనార్హం. గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరిన చైర్పర్సన్ రమాకుమారిని పదవి నుంచి దించేయడానికి ఆ పార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. తనపై అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి ప్రధాన కారకులు వైస్చైర్మన్లే అని భావించిన చైర్పర్సన్.. ఆ ఇద్దరినీ పదవుల్లో లేకుండా చేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. దీంతో ఎలమంచిలి మునిసిపాలిటీ రాజకీయాలు మారోసారి చర్చనీయాశంగా మారాయి.
ఎలమంచిలి మునిసిపాలిటీకి 2021లో జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకుగాను 23 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. టీడీపీ, ఇండిపెండెంట్ ఒక్కో వార్డులో గెలిచారు. వైసీపీకి చెందిన పిల్లా రమాకుమారి చైర్పర్సన్గా, బెజవాడ వెంకట గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాఽథ ఈశ్వర గుప్తా వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ వుండడంతో గత ఏడాది సాధారణ ఎన్నికల వరకు ఏకపక్షంగా పాలన సాగింది. న్నికల తరువాత వైసీపీ ఘెరంగా ఓడిపోయి, కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అంతర్గత కారణాలేమిటో తెలియదుగానీ చైర్పర్సన్ రమాకుమారి వైసీపీని వీడి తన సోదరుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆనందకుమార్తో కలిసి బీజేపీలో చేరారు. కానీ వైసీపీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా ఆమె బాటలో నడవలేదు. కౌన్సిల్లో పూర్తి బలం వుండడంతో పార్టీ ఫిరాయించిన రమాకుమారిని చైర్పర్సన్ పదవి నుంచి దించేయాలని అధిష్ఠానం హుకుం జారీచేసింది. దీంతో కౌన్సిలర్లతో స్థానిక సీనియర్ నేతలు సమావేశమై చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఇద్దరు వైస్చైర్మన్లతోసహా మొత్తం 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కమిషనర్కు నోటీసు అందజేశారు. అనంతరం చైర్పర్సన్, ఆమె సోదరుడు తెరవెనుక పావులు కదిపారు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సంతకాలు చేసిన వారిలో పలువురు కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని తేలడంతో గత నెల 21వ తేదీన కమిషనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
వైస్చైర్మన్లపై ప్రతీకారం?
తనపై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇద్దరు వైస్చైర్మన్లు ప్రధాన కారణంగా భావించిన చైర్పర్సన్ రమాకుమారి.. ఆ ఇద్దరిని పదవీచ్యుతులను చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వైసీపీకి 22 మంది కౌన్సిలర్లు (అధికారికంగా) వుండగా, వారిలో 13 మందిని చైర్పర్సన్ తన వైపునకు తిప్పుకున్నారు. ఇద్దరు వైస్చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ మొత్తం 16 మంది సంతకాలతో గురువారం మునిసిపల్ మేనేజర్కు నోటీసు అందజేశారు. కమిషనర్ ప్రసాదరాజు ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
నోటీసుపై సంతకాలు చేసిన సభ్యులు
చైర్పర్సన్ పిల్లా రమాకుమారి, టీడీపీకి చెందిన మజ్జి రామకృష్ణ (23వ వార్డు), ఇండిపెండెంట్ సీరా సాయి ప్రసన్న (8వ వార్డు), వైసీపీకి చెందిన పండూరి హరనాథ్ (2వ వార్డు),తుంపాల శ్రీనివాసరావు (3వ వార్డు), ఆడారి పార్వతి (6వ వార్డు), కట్టమూరి సుజాత (7వ వార్డు), మంజేటి అప్పల కొండమ్మ (10వ వార్డు), చాగంటి రాజు (14వ వార్డు), మైచర్ల కిరణ్ (16వ వార్డు), రాయి భార్గవి(18వ వార్డు), సుంకరి మరిణేశ్వరరావు (24వ వార్డు) ఆర్డీఎస్జీటీ కొండలరావు (25వ వార్డు), ఈరిగెల గణేశ్ (15వ వార్డు), పడాల కావ్య (17 వార్డు), పిట్టా సత్తిబాబు (19వ వార్డు).
రాజీనామా ఆలోచనలో వైస్చైర్మన్లు?
మునిసిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలుపుకుని మొత్తం 26 మంది వున్నారు. వైస్చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు మంది.. అంటే 17 మంది సభ్యులు అవసరం. అవిశ్వాస నోటీసుపై 16 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఎమ్మెల్యేతో కలుపుకుంటే 17 మంది అవుతారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడం, వైస్చైర్మన్లను పదవి నుంచి దించడం ఖామయని చైర్పర్సన్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందుగానే రాజీనామా చేయాలని వైస్చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆర్రెపు నాగ త్రినాథ గుప్తా యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే పార్టీ పెద్దలతో మాట్లాడిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వైస్చైర్మన్ నాగత్రినాథ ఈశ్వరగుప్తా చెబుతున్నారు.