అడ్డగోలుగా ఇసుక తవ్వకం
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:10 AM
పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామ పరిధిలో గోస్తనీ నదికి ఆనుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.
రోజుకు 40 నుంచి 50 ట్రాక్టర్లు తరలింపు
పద్మనాభం మండలం కృష్ణాపురంలో వైసీపీ నేత దందా...కూటమి నేతల అండ
విశాఖపట్నం, జూలై 28 (ఆంధ్రజ్యోతి):
పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామ పరిధిలో గోస్తనీ నదికి ఆనుకుని అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. సర్వే నంబర్ 178 (ప్రభుత్వ భూమి)లో సుమారు పది రోజులుగా గ్రామానికి చెందిన వైసీపీ నేత, మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు ఉదయం నుంచి రాత్రి వరకూ ఇసుక తవ్వి, తరలిస్తున్నారు. రోజుకు 40 నుంచి 50 ట్రాక్టర్ల ఇసుక విక్రయిస్తున్నారు.
ఈ ఏడాది మే నెలలో ఒకసారి తవ్వకాలు చేపట్టగా సచివాలయం, రెవెన్యూ సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. మళ్లీ పది రోజుల క్రితం తవ్వకాలు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఇసుక మేటలను తవ్వేందుకు యత్నించినప్పుడు కొందరు వైసీపీ నేతలు హెచ్చరించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మండల టీడీపీ నేతలు కొందరు అండదండలు అందించడంతో వైసీపీ నేతకు అడ్డుచెప్పే వారు కరువయ్యారు. పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో అటువైపు ఎవరు వెళ్లడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే ట్రాక్టర్తో తొక్కిస్తానంటూ బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇదిలావుండగా నదికి, పొలాలకు మధ్య గోడలా ఇసుక మేటలు రక్షణగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇసుక తవ్వుకుపోతే వరదలు వచ్చినప్పుడు నీరు పొలాలపైకి వచ్చేస్తుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోస్తని నదికి ఆనుకుని ఇసుక తవ్వకాలకు ఎవరికీ తాము అనుమతి ఇవ్వలేదని విశాఖ జిల్లా గనుల శాఖ ఏడీ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.