అసంపూర్తి భవనాలకు మోక్షం
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:12 AM
జిల్లాలో అరకొర నిర్మాణాలతో దర్శనమిస్తున్న అంగన్వాడీ భవనాలు త్వరలో పూర్తి కానున్నాయి. జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న 141 అంగన్వాడీ భవనాలకు రూ.9 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయించి పూర్తి చేయనున్నారు.
- జిల్లాలో అసంపూర్తిగా 141 అంగన్వాడీ భవనాలు
- రూ.9 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పూర్తి చేయాలని నిర్ణయం
- త్వరలో పనులు ప్రారంభం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అరకొర నిర్మాణాలతో దర్శనమిస్తున్న అంగన్వాడీ భవనాలు త్వరలో పూర్తి కానున్నాయి. జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న 141 అంగన్వాడీ భవనాలకు రూ.9 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయించి పూర్తి చేయనున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 2014-18 సంవత్సరాల మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నాబార్డు నిధులతో 250కి పైగా అంగన్వాడీ కేంద్రాల భవనాలను మంజూరు చేసింది. అప్పట్లో దాదాపు అన్ని భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఎన్నికలు సమీపించే నాటికి బేస్మెంట్ స్ఠాయిలో 7, లింటల్ లెవిల్ 13, రూఫ్లెవిల్ 16, శ్లాబ్ లెవిల్ 41, ఫిన్సింగ్ స్థాయిలో 64 భవనాలు.. మొత్తం 141 అంగన్వాడీ భవనాలు నిర్మాణ పనులు పూర్తికాక వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయా భవన నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఐదేళ్లలో ఈ భవనాల నిర్మాణానికి పైసా నిధులు కూడా కేటాయించలేదు.
అసంపూర్తి భవనాలు పూర్తి చేయాలని నిర్ణయం
జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న 141 అంగన్వాడీ భవనాలకు రూ.9 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తున్నట్టు ఇటీవల కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి, మానెటరింగ్ కమిటీ వెల్లడించింది. దీంతో ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పీఆర్ ఈఈ వీరన్నాయుడును వివరణ కోరగా జిల్లాలో అసంపూర్తి అంగన్వాడీ భవనాలకు సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయన్నారు. పరిపాలనపరమైన ఆమోదం లభించగానే పనులు ప్రారంభించి, పూర్తి చేస్తామని తెలిపారు.