ఘాట్ల్లో జంగిల్ క్లియరెన్స్కు మోక్షం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:31 PM
ల్లాలోని ఘాట్ మార్గాల్లో జంగిల్ క్లియరెన్స్కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఘాట్లో రోడ్లకు ఇరువైపులా తుప్పలు పెరగడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని పాడేరు, అనంతగిరి, డౌనూరు, మారేడుమిల్లి ఘాట్ మార్గాల్లోని జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు రోడ్ల, భవనాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు.
ఘాట్ల అభివృద్ధిని పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
వర్షాలతో విపరీతంగా పెరిగిన తుప్పలు
తుప్పలు తొలగింపుతో ప్రమాదాలు
తగ్గుతాయంటున్న డ్రైవర్లు
ఘాట్ల్లో పెరిగిన వాహనాల రాకపోకలు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ఘాట్ మార్గాల్లో జంగిల్ క్లియరెన్స్కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఘాట్లో రోడ్లకు ఇరువైపులా తుప్పలు పెరగడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని పాడేరు, అనంతగిరి, డౌనూరు, మారేడుమిల్లి ఘాట్ మార్గాల్లోని జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు రోడ్ల, భవనాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పాడేరు, అనంతగిరి ఘాట్ల్లో పనులు జోరుగా జరుగుతున్నాయి. ఘాట్ల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టడడం ద్వారా ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణం సుఖమయంగా సాగుతుందని డ్రైవర్లు అంటున్నారు.
పాడేరు ఘాట్లో పెరిగిన వాహన రాకపోకలు
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంలో పోల్చితే వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్ నిత్యం వాహనాలతో రద్దీగానే ఉంటుంది. ఈక్రమంలోనే ప్రమాదాలు అధికమవుతున్నాయి.
గత వైసీపీ పాలనలో జరగని జంగిల్ క్లియరెన్స్
గిరిజన ప్రాంతంలో వర్షాలు అధికంగా ఉండడంతో ఘాట్ మార్గాల్లో తుప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. దీంతో ప్రతి ఏడాది వర్షాకాలం తర్వాత ఘాట్లో విధిగా జంగిల్ క్లియరెన్స్ చేయాలి. కానీ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడంతో ఘాట్ మొత్తం తుప్పలే కనిపిస్తున్నాయి. దీంతో ఘాట్లోని రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని దుస్థితి కొనసాగింది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా మూడేసి అడుగుల చొప్పున అంచులు ఉంటాయి. కాని ఆ అంచులన్నీ తప్పులతోనే కప్పేశాయి. ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా తుప్పలు పెరగడంతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనం కనపడని పరిస్థితి ప్రమాదాలకు దారి తీస్తున్నది. దీంతో మలుపుల వద్ద ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని డ్రైవర్లు ఆవేదన చెందేవారు.
ఎట్టకేలకు కూటమి పాలనలో మోక్షం
జిల్లాలోని ఘాట్ల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టడడంపై డ్రైవర్లు, ప్రయాణికులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈనెలాఖరు నుంచి జిల్లాలో పర్యాటకుల సీజన్ ప్రారంభం కానుండడంతో ఘాట్ల్లో పర్యాటకులు సురక్షిత ప్రయాణానికి అవకాశం కలుగుతుందని పలువురు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా కూటమి సర్కారు ఘాట్ మార్గాలు అభివృద్థి, ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.