ఎల్కేజీకి రూ.లక్ష!
ABN , Publish Date - May 21 , 2025 | 12:48 AM
నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ప్రైవేటు పాఠశాలల బాదుడు
నగరంలో మూడు కేటగిరీలు...
టాప్ స్కూల్స్లో ఫీజు రూ.60 వేల నుంచి రూ.80 వేలు
రెండో కేటగిరీలోని స్కూల్స్లో రూ.30 వేల నుంచి రూ.60 వేలు
మూడో కేటగిరీలోని స్కూల్స్లో రూ.20 వేల నుంచి రూ.30 వేలు
ట్రాన్స్పోర్టు, పుస్తకాలు, యూనిఫామ్ ఖర్చులు అదనం
తక్కువలో తక్కువ రూ.50 వేలు నుంచి రూ.1.5 లక్షలు వసూలు
ఏటా పది నుంచి 20 శాతం మేర పెంపు
నియంత్రణపై దృష్టిసారించని విద్యా శాఖ అధికారులు
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి) :
నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏటా పది నుంచి 20 శాతం మేర పెంచేస్తూ పిల్లల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ప్రైవేటు స్కూల్స్ వసూలుచేసే ఫీజులను పర్యవేక్షించాల్సిన విద్యా శాఖ వర్గాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి.
ఫీజులను బట్టి నగర పరిధిలోని స్కూల్స్ను మూడు కేటగిరీలుగా విభజించవచ్చు. ఇందులో టాప్ కేటగిరీలో ఉండే స్కూల్స్లో ఫీజులు రూ.లక్షల్లో ఉంటాయి. ఈ జాబితాలో పది పాఠశాలలు ఉంటాయి. ఆయా స్కూల్స్లో ఎల్కేజీ విద్యార్థికి తక్కువలో తక్కువ లక్ష నుంచి లక్షన్నర (ఏసీ అయితే) వరకూ చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజుల పేరిట సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీటితోపాటు రవాణా చార్జీ (బస్సు) కింద నెలకు రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.24 వేలు, పుస్తకాల కోసం రూ.4 వేల నుంచి రూ.8 వేలు, యూనిఫామ్ కోసం రూ.4 వేల నుంచి ఆరు వేలు వసూలు చేస్తున్నారు. ఇతర యాక్టివిటీస్ పేరిట మరో మూడు నుంచి ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే పేరొందిన స్కూల్స్లో ఎల్కేజీకి కనీసం లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక స్కూల్స్లో ఉండే ఏసీ, ఇతర సదుపాయాలను బట్టి అదనంగా మరో రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండో కేటగిరీకి చెందిన స్కూల్స్లో ఎల్కేజీ విద్యార్థికి అడ్మిషన్ ఫీజు, ఇతర ఫీజులు కలిపి ఏడాదికి 30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటున్నాయి. ఈ స్కూల్స్లో కూడా పుస్తకాలకు, రవాణా ఖర్చులకు, యూనిఫామ్కు మరో రూ.30 నుంచి రూ.40 వేలు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన స్కూల్స్ నగర పరిధిలో సుమారు 50 వరకు ఉంటాయి. ఈ స్కూల్స్లో ఎల్కేజీ విద్యార్థికి రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ అవుతోంది. ఇక, మూడో కేటగిరీకి చెందిన స్కూల్స్ ఫీజులు మొదటి రెండు కేటగిరీలతో పోలిస్తే కొంత తక్కువగా ఉన్నప్పటికీ భారీగానే వసూలు చేస్తున్నారు. ఈ స్కూల్స్ కూడా అడ్మిషన్స్, ఇతర ఫీజులు కలిపి ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర ఖర్చులకు కలిపి మరో రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. అంటే, ఎల్కేజీ చదివించాలంటే సాధారణ, మధ్య తరగతి ప్రజలకు కనీసం రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక, తరగతిని బట్టి ఫీజులు మారుతుంటాయి. ఒక్కో తరగతికి వెళుతున్న కొద్దీ 10 నుంచి 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టాప్ స్కూల్లో ఐదో తరగతి విద్యార్థికి రెండు లక్షల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు.
ప్రైవేటు వైపు పరుగులు..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉత్తమ బోధనా నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ సాధారణ, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు స్కూల్స్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు భారీగానే ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు వసూలుచేసే ఫీజులను నియంత్రించడంలో విద్యా శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఫీజుల పట్ల తల్లిదండ్రుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
రెండో తరగతికి రూ.లక్షకుపైనే...
- రాజేశ్వరరావు, విద్యార్థి తండ్రి
మా అబ్బాయి ప్రముఖ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఏడాదికి రూ.60 వేలు స్కూల్ ఫీజు కడుతున్నా. పుస్తకాలు, ఇతర ఖర్చులకు మరో రూ.40 వేలు వరకూ ఖర్చు అవుతోంది. ప్రత్యేక కార్యక్రమాల కోసం మరో పది వేల రూపాయలు చెల్లిస్తున్నాం. రెండో తరగతి చదివే విద్యార్థికి లక్ష రూపాయలకు పైగా వెచ్చిస్తున్నా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాడి జీవితం బాగుంటుందన్న ఆశతో ఖర్చుకు వెనుకాడడం లేదు. సాధారణ స్కూల్లో చేర్పించాలని ఆలోచించా. ఈ స్కూల్తో పోలిస్తే రూ.3 వేలు మాత్రమే తగ్గుతోంది. ఆ మాత్రం దానికి ఎందుకని పెద్ద స్కూల్లో చేర్పించాం. చదువుతోపాటు క్రమశిక్షణ, ఇతర యాక్టివిటీస్కు పెద్దపీట వేస్తారని చెప్పడంతో ఈ స్కూల్లో చేర్పించాను.