రౌడీషీటర్ ఎల్లాజీ హత్య
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:48 AM
వన్టౌన్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ (35) జ్ఞానాపురం శ్మశానవాటికలో మంగళవారం హత్యకు గురయ్యాడు.
జ్ఞానాపురం శ్మశానంలో పట్టపగలే ఘటన
విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):
వన్టౌన్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ (35) జ్ఞానాపురం శ్మశానవాటికలో మంగళవారం హత్యకు గురయ్యాడు. కొంతమంది స్నేహితులను వెంటేసుకుని శ్మశానవాటికకు వెళ్లిన ఎల్లాజీ...అక్కడ పనిచేస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. తమ వద్ద లేవని వారు సమాధానం చెప్పగా...కత్తితో దాడికి యత్నించాడు. వారంతా ఎదురుదాడి చేయడంతో ఎల్లాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి కంచరపాలెం పోలీసులు గోప్యత పాటిస్తుండగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వన్టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కలిగివున్న ఎల్లాజీ తన స్నేహితులైన నక్కిన యేసురాజు మరో ఇద్దరితో కలిసి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శ్మశానవాటిక లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ పనిచేసుకుంటున్న నరసింహమూర్తి, గణేష్, శ్రీను, కృష్ణ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వాళ్లు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఎల్లాజీ తన జేబులో ఉన్న చాకుతీసి నరసింహమూర్తి, గణేష్ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో గణేష్ కర్రతో ఎల్లాజీని తలపై కొట్టగా, నరసింహమూర్తి తన చేతిలో ఉన్న గడ్డపారతో ఎల్లాజీ తలపై మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో నక్కిన యేసు కూడా వారిపై దాడికి యత్నించడంతో అతడిని కూడా గడ్డపారతో కొట్టడంతో తలకు గాయమైంది. మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిని యేసుని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. దీనిపై కంచరపాలెం పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇదిలావుండగా హత్యకు గురైన ఎల్లాజీ గత నెల 23న జైలు నుంచి విడుదల కావడం విశేషం. హత్య జరిగిందని, దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.