బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
ABN , Publish Date - May 08 , 2025 | 11:34 PM
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఆంధ్ర, ఒడిశా అధికారులు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఒనకఢిల్లీ వోహెచ్పీసీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. 2024- 2025 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఏ రాష్ట్రం తమ వాటాగా ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు.
బలిమెల, జోలాపుట్ జలాశయాల్లో 36.8589 టీఎంసీల నిల్వ
ఆంధ్రాకు 18.4945, ఒడిశాకు 18.3644 టీఎంసీలుగా పంపకం
సీలేరు, మే 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం ఆంధ్ర, ఒడిశా అధికారులు ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఒనకఢిల్లీ వోహెచ్పీసీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. 2024- 2025 నీటి సంవత్సరంలో బలిమెల జలాశయం నుంచి ఏ రాష్ట్రం తమ వాటాగా ఎంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. 2024 జూలై నుంచి ఏప్రిల్ 25 వరకు ఆంధ్రా తన వాటాగా 78.5107 టీఎంసీలను, ఒడిశా తన వాటాగా 78.6409 టీఎంసీలు వినియోగించుకున్నట్టు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఇప్పటి వరకు ఒడిశా.. ఆంధ్రా కంటే 0.5330 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు నిర్ధారించారు. ప్రస్తుతం బలిమెలలో 17.895 టీఎంసీలు, జోలాపుట్లో 17.2639 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు, ఈ నెలాఖరు నాటికి రెండు జలాశయాల్లో 1.7 టీఎంసీల నీటి నిల్వలు చేరతాయని అంచనా వేశారు. దీంతో బలిమెల, జోలాపుట్లలో మొత్తం నీటి నిల్వలు 36.8589 టీఎంసీలుగా లెక్కించారు. వీటిలో ఆంధ్రా వాటాగా 18.4945 టీఎంసీలు, ఒడిశా వాటాగా 18.3644 టీఎంసీలు పంపకాలు చేశారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం ఆంధ్రాకు 3 వేల క్యూసెక్కులు, ఒడిశాకు 3 వేల క్యూసెక్కులు నీటిని వినియోగించుకోవడానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య ఏకగ్రీవంగా ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో ఒడిశా తరఫున బలిమెల సీనియర్ జనరల్ మేనేజర్ దిలీప్కుమార్స్వైన్, జనరల్ మేనేజర్ రాధామాధవ్ ఓటా, అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంత్కుమార్ ఐచ్, పొట్టేరు ఇరిగేషన్ ప్రాజెక్టు చీఫ్ కనస్ట్రక్షన్ ఇంజనీర్ పితాబాసి సేతి, చిత్రకొండ ఎర్త్ డ్యాం డివిజన్ ఎస్ఈ రమాకాంతపాత్ర, ఏఈఈలు తుషార్ రంజన్కుంతియా, గదాధర్ ప్రధాన్, కేసీ ఫాణి పాల్గొనగా, ఆంధ్రా తరఫున సీలేరు కాంప్లెక్సు జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.చంద్రశేఖర్రెడ్డి, ఈఈలు ఎన్.శ్రీనివాసరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఏడీఈ దుర్గా శ్రీనివాసరావు పాల్గొన్నారు.