కిలేడీ
ABN , Publish Date - May 10 , 2025 | 12:38 AM
అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ప్రభుత్వ శాఖల సిబ్బందినీ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

తీరు మార్చుకోని పోలీస్ అధికారిణి స్వర్ణలత
నగరంలో పనిచేస్తున్న సమయంలో నోట్ల మార్పిడి వ్యవహారంలో ఒకసారి అరెస్టు
ఆ తరువాత వైసీపీ నాయకుడి ద్వారా మళ్లీ పోస్టింగ్
ఇప్పుడు ఏసీబీ పేరుతో బెదిరింపులు
మధురవాడ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం నుంచి డబ్బులు గుంజేందుకు యత్నించి మరోమారు పోలీసులకు చిక్కిన వైనం
కాల్ లిస్ట్లో కళ్లు కొందరు కీలక అధికారుల నంబర్లు
తరచూ సంభాషణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ప్రభుత్వ శాఖల సిబ్బందినీ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇందుకోసం ఆమె నమ్మకమైన మనుషులతో బృందాలనే ఏర్పాటుచేసుకున్నారు. అవసరాలకు ఉపయోగపడతారని రాజకీయ ప్రముఖులతోను అంట కాగుతున్నారు.
ఆమె గతంలో నగరంలో పనిచేసినప్పుడు వైసీపీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడితో గట్టి పరిచయమే ఉంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి వివరాలు కావాలని సదరు నాయకుడు కోరగా పోలీస్ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆమె ఆ జాబితా సంపాదించి గంటల వ్యవధిలోనే అందించారు. ఆమెకు సినిమాలపై మోజు, సదరు నాయకుడికి కొన్ని సినిమాలు నిర్మించిన అనుభవం కూడా ఉండడంతో వారి లావాదేవీలు మరింత ముందుకు వెళ్లాయి. ప్రభుత్వం నిషేధించిన రూ.2 వేల నోట్లను భారీ సంఖ్యలో మార్పిడి వ్యవహారంలో నేవీ సిబ్బందినే బెదిరించి ఆమె 2023లో పోలీసులకు దొరికిపోయారు. ఆ కేసుతో అరెస్టుయి, జైలు పాలయ్యారు. ఆ తరువాత కూడా వెనక్కి తగ్గలేదు. వైసీపీకి చెందిన మరో నేత ద్వారా కేసు కొట్టి వేయించుకొని మళ్లీ పోస్టింగ్ వేయించుకున్నారు. బాపట్లలో ఉద్యోగం చేస్తూనే విశాఖలో పలు శాఖల అధికారులను బెదిరిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ల శాఖలపై దృష్టి
రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, రిజిసే్ట్రషన్ల శాఖలో సబ్ రిజిస్ట్రార్లకు అడ్డగోలు ఆదాయం వస్తుందని గ్రహించి, కీలకమైన స్థానాల్లో ఉన్నవారిని ‘ఏసీబీ’ పేరుతో బెదిరించి స్వర్ణలత భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ సీఐగా వెళ్లి దొరికిపోయిన బలగా సుధాకర్ ఆమె బృందంలో మనిషేనని బయటపడింది. నకిలీ సీఐ సుధాకర్...‘ఉన్నతాధికారితో మాట్లాడండి’ అంటూ స్వర్ణలతకు ఫోన్ చేయడంతో ఆమె గుట్టు రట్టయింది. తొలుత ఆమెను తప్పించాలని కొందరు పెద్దలు యత్నించారు. కానీ అప్పటికే సమాచారం లీక్ కావడం, పత్రికల్లో ఆమె వివరాలు రావడంతో అరెస్టు చేయక తప్పలేదు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్లో పలు శాఖలకు చెందిన కొందరు అధికారుల నంబర్లు ఉన్నట్టు గుర్తించారు. వారితో రెగ్యులర్గా సంభాషిస్తున్నట్టు తెలిసింది. అందులో కొందరు అధికారులు ఆమెను ప్రత్యేకంగా కలవడానికి ప్రతి నెలా పని గట్టుకొని విజయవాడ వెళుతున్నట్టు ఆయా శాఖల సిబ్బంది గుసగుసలాడుతున్నారు. సాధారణంగా తహశీల్దార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు ప్రతి నెలా విజయవాడ వెళ్లి ఉన్నతాధికారులను కలవాల్సిన అవసరం ఉండదు. కానీ వారు వెళుతున్నారంటే ఏదో ఉందని అనుమానిస్తున్నారు.
జీవీఎంసీ జోన్-2లో ఏమి జరిగిందో...?
మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లడానికి ముందు నకలీ ఏసీబీ సీఐ బలగ సుధాకర్ జీవీఎంసీ జోనల్-2 కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ వారు అనుకున్న విధంగా పని పూర్తయినట్టు తెలిసింది. అక్కడ ఎంత పుచ్చుకున్నారు?, ఎవరు ఇచ్చారు?...అనేది బయటకు రానివ్వడం లేదు. ఏసీబీ అధికారులు స్వర్ణలత కేసును మరింత పకడ్బందీగా విచారణ చేసి, అసలు ఇప్పటివరకూ ఎంతమందిని బెది రించారు?, ఏ మేరకు వసూలు చేశారనే వివ రాలు వెలికితీయాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడకుండా చూడాలి.