చీకట్లో అర్జీల స్వీకరణ!
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:27 AM
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గల ప్యానల్ బోర్డులో కేబుల్ కాలిపోవడంతో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కలెక్టరేట్లో ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం
విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గల ప్యానల్ బోర్డులో కేబుల్ కాలిపోవడంతో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర అధికారులు సెల్ఫోన్ టార్చ్ వెలుతురులో అర్జీలను స్వీకరించాల్సి వచ్చింది. జేసీ, ఇతర అధికారులు అంతంతమాత్రపు వెలుతురులోనే అర్జీదారులతో మాట్లాడారు. కొంతసేపటి తరువాత విద్యుత్ను పాక్షికంగా పునరుద్ధరించారు. ప్యానల్ బోర్డులో కాలిపోయిన కేబుల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు ప్రక్రియ రాత్రి ఏడు గంటల సమయంలో పూర్తయ్యింది. అప్పటివరకూ కొన్ని ఛాంబర్లు మినహా ఇతర సెక్షన్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. కలెక్టరేట్లో లోడుకు అక్కడ ఉన్న ప్యానల్స్ సామర్థ్యం సరిపోవడం లేదు. భవనంలో విద్యుత్ వినియోగ సామర్థ్యానికి అనుగుణంగా వైరింగ్, ప్యానల్స్ ఏర్పాటుచేయాల్సి ఉందని ఈపీడీసీఎల్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.