Share News

సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది హేతుబద్ధీకరణ

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:14 AM

గ్రామ/వార్డు సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది హేతుబద్ధీకరణకు కసరత్తు జరుగుతోంది.

సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది హేతుబద్ధీకరణ

  • ఒక్కొక్కరికి రెండు సచివాలయాలు కేటాయింపు

  • జాబితాలో వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్‌, ఫిషరీస్‌, పశు సంవర్ధక శాఖ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సర్వేయర్‌, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌, ఎమినిటీస్‌ సెక్రటరీలు

  • మిగులు సిబ్బంది ఆయా శాఖలకు బదలాయింపు

  • 15వ తేదీలోగా ప్రక్రియ పూర్తి

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

గ్రామ/వార్డు సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది హేతుబద్ధీకరణకు కసరత్తు జరుగుతోంది. ఇకపై సాంకేతిక సిబ్బంది రెండేసి సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు దగ్గర దగ్గరగా ఉన్న సచివాలయాలను మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఇతర సిబ్బంది మాత్రం ఏ సచివాలయంలో ఉన్నవారు అక్కడే పనిచేస్తారు.

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 56, జీవీఎంసీలో 551...మొత్తం 607 సచివాలయాలు ఉన్నాయి. నాలుగు గ్రామీణ మండలాల్లో 514 మంది, జీవీఎంసీ పరిధిలో 4,295...మొత్తం 4,809 మంది ప్రస్తుతం ఉన్నారు. మరో 514 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో రమారమి 500 మంది వివిధ కారణాలతో సెలవుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలను హేతుబద్ధీకరించి అదనపు సిబ్బందిని ఇతర శాఖలకు పంపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సచివాలయాల్లో సాంకేతిక సిబ్బందికి రెండేసి సచివాలయాలు అప్పగించే కార్యక్రమం చేపట్టింది. గ్రామ సచివాలయాల్లో సాంకేతిక సిబ్బంది జాబితాలో వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్‌, ఫిషరీస్‌, పశు సంవర్ధక శాఖ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సర్వేయర్‌, ఏఎన్‌ఎం, నగర పరిధిలో ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌ ఎఎన్‌ఎం, ఎమినిటీస్‌ సెక్రటరీలు ఉంటారు. సాంకేతిక సిబ్బందిగా పరిగణించే సెక్రటరీలు, అసిస్టెంట్లు ఇకపై దగ్గరదగ్గరగా ఉన్న రెండు సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రస్తుతం రెండేసి సచివాలయాలను మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన సిబ్బందిని ఆయా ప్రభుత్వ శాఖలకు పంపుతారు. ఉదాహరణకు అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు వ్యవసాయ శాఖకు, ఉద్యానవన అసిస్టెంట్లు సంబంధిత శాఖకు, ఏఎన్‌ఎంలు ఆరోగ్య శాఖకు వెళతారు. ఈ ప్రక్రియ ఈనెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాంట్రాక్టు కార్మికుల తొలగింపు విధివిధానాలపై కమిటీ

  • స్టీల్‌ ప్లాంటు యాజమాన్య ప్రతినిధులు

  • ఒక్కరిని తొలగించినా సహించేది లేదన్న కార్మిక సంఘ నాయకులు

  • అసంపూర్తిగా చర్చలు...26వ తేదీకి వాయిదా

ఉక్కుటౌన్‌షిప్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై నగరంలోని రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ మొహంతి సమక్షంలో మంగళవారం ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘ నాయకుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఆపాలని కార్మిక సంఘ నాయకులు ప్రస్తావించగా, కంపెనీ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది తగ్గింపునకు చర్యలు చేపట్టామని యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. ఇటీవల తొలగించిన 248 మంది కాంట్రాక్టు కార్మికుల బయోమెట్రిక్‌ను పునరుద్ధరించాలని రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ సూచించారు. అయితే అందుకు యాజమాన్యం ప్రతినిధులు స్పందిస్తూ కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై విధి విధానాలకు కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్లాంటులో ఏ ఒక్క కార్మికుడినీ తొలగించినా సహించేది లేదని, ఆందోళనను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతల హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చర్చలను ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ సమావేశంలో అధికారులు జీఎం ఎం.మధుసూదనరావు, ఖర్‌, శంకర్‌, కార్మిక నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, వంశీకృష్ణ, సత్యారావు పాల్గొన్నారు. సమావేశ అనంతరం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 12 , 2025 | 01:14 AM