ఏపీ పీజీఈసెట్లో ర్యాంకుల పంట
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:08 AM
రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు.
రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్లో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యార్థులు
కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో మొదటి ర్యాంకులు కైవసం
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఎంటెక్లో బయో టెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజనీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఇనుస్ర్టుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, నానో టెక్నాలజీ విభాగాలతో పాటు ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించారు.
విద్యార్థుల సత్తా..
బయోటెక్నాలజీలో సీతమ్మధారకు చెందిన చాగంటి లలిత్ అఖిలేష్, గాజువాకకు చెందిన తామ్లక మైటీ రెండో ర్యాంకు సాధించారు. అలాగే, కెమికల్ ఇంజనీరింగ్ స్ర్టీమ్లో సీతమ్మధారకు చెందిన పి.విష్ణుప్రతాప్ మొదటి ర్యాంకు, గోపాలపట్నానికి చెందిన పలికల గణేష్ రెండో ర్యాంకు సాధించారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన సబ్బవరపు సాయి ఈశ్వర్ ఆరో ర్యాంకు, విశాఖ నగర పరిధిలోని పోతినమల్లయ్యపాలేనికి చెందిన బోపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెంటసీమ బోనంగి గ్రామానికి చెందిన నార్ల సాయిఆదిత్య పదో ర్యాంకు సాధించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పెందుర్తికి చెందిన బాలిబాని సునీల్ మొదటి ర్యాంకు, సీతమ్మధారకు చెందిన అల్లు వెంకట హేమంత్ నాగేశ్వరనాయుడు పదో ర్యాంకు సాధించారు. ఫుడ్ టెక్నాలజీ స్ర్టీమ్లో గోపాలపట్నానికి చెందిన బత్తుల శ్రుతి గీత రెండో ర్యాంకు, అల్లూరి జిల్లా పెదబయలు ప్రాంతానికి చెందిన దుంబెరి భానుప్రసాద్ బాబి ఆరో ర్యాంకు, గాజువాకకు చెందిన ఈగల లిఖిత తొమ్మిదో ర్యాంకు సాధించారు. ఇన్స్ర్టుమెంటేషన్ స్ర్టీమ్లో గాజువాకకు చెందిన సరిపల్లి జాహ్నవి కీర్తి నాలుగో ర్యాంకు, తాటిచెట్లపాలేనికి చెందిన సదరం షర్మిత ఏడో ర్యాంకు సాధించారు. మెకానికల్ ఇంజనీరింగ్లో అనకాపల్లి జిల్లా చింతల గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన బోకం కుషాల్ దీపక్ మూడో ర్యాంకు, అగనంపూడికి చెందిన కూడ ప్రశాంత్ తొమ్మిదో ర్యాంకు, కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన ఈర్ల లీలా వంశీ పదో ర్యాంకు సాధించారు. మెటలర్జీ స్ర్టీమ్లో అగనంపూడికి చెందిన ఆకుల పవన్ మాదేవ్ ఐదో ర్యాంకు, కురుపాం మార్కెట్కు చెందిన నున్న శ్రీనివాస్ ఆరో ర్యాంకు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన బోడబల్ల నీరజ ఏడో ర్యాంకు, నగరంలోని దొండపర్తికి చెందిన నేబార్తి సూర్యప్రకాష్ ఎనిమిదో ర్యాంకు సాధించారు.