రైల్వే జోన్ పనులకు శ్రీకారం
ABN , Publish Date - May 23 , 2025 | 01:25 AM
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి.
ముడసర్లోవలో కేటాయించిన భూమి చదును పనులు ప్రారంభం
రూ.172 కోట్లతో కార్యాలయ నిర్మాణం
28 నెలల్లో పూర్తి చేయడానికి యత్నం
చీఫ్ పరిపాలన అధికారి పర్యవేక్షణ
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ముడసర్లోవలో జీవీఎంసీ ఇచ్చిన స్థలంలో కొద్దిరోజులుగా భూమి చదును పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.172 కోట్ల అంచనా వ్యయంతో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. పనులు ప్రారంభించిన నాటి నుంచి 36 నెలల్లో పూర్తిచేయాలనేది లక్ష్యం కాగా 28 నెలల్లోనే సిద్ధం చేస్తామంటున్నారు. రెండు కాంట్రాక్ట్ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. పనిచేసే సిబ్బంది కోసం క్యాంపు షెల్టర్ల నిర్మాణం పూర్తిచేసి అక్కడ వంటకు ఏర్పాట్లు చేశారు. జోన్ కార్యాలయం నిర్మాణ పనులను ప్రస్తుతం చీఫ్ పరిపాలన అధికారి పర్యవేక్షిస్తున్నారు.
వేగంగా సాగాలంటే జీఎం ఉండాల్సిందే
జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 8న శంకుస్థాపన చేశారు. నాలుగు నెలలు గడిస్తే గాని అక్కడ భూమి చదును పనులు ప్రారంభం కాలేదు. సాధారణంగా కొత్త రైల్వే జోన్ ప్రకటిస్తే...దాని పనితీరు, పరిధి, ఇతరత్రా వివరాలతో మొదట గెజిట్ను ప్రకటిస్తారు. దక్షిణ కోస్తా జోన్ విషయంలో ఆ సంప్రదాయం పాటించలేదు. గెజిట్ ప్రకటిస్తే...అందులో ప్రతి పనికి నిర్దేశిత సమయం ఇచ్చి గడువు పెట్టాలి. ఏ తేదీకి పూర్తిచేయాలో స్పష్టంచేయాలి. వాటిని పర్యవేక్షించడానికి జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నియమించాలి. ఆయన విధులు నిర్వహించడానికి అవసరమైన భవనం కేటాయించాలి. ఇవన్నీ జరిగితే దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలు మొదలైపోతాయి. ఇదంతా ఒడిశా నాయకులకు ఇష్టం లేదు. తూర్పు కోస్తా జోన్ పెత్తనమే ఇంకా కొన్నాళ్లు సాగాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే విశాఖ జోన్ పనులు జాప్యం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీబయలుదేరిన సీఎం చంద్రబాబునాయుడు...కేంద్ర మంత్రిని కలిసినప్పుడు విశాఖ జోన్ గెజిట్ గురించి ప్రస్తావించి, పనులు వేగవంతం చేయాలని కోరితే తప్ప ఇక్కడ స్పీడ్ అందుకోవు. విశాఖ జోన్ త్వరగా పనిచేయాలంటే ఢిల్లీలో ఒత్తిడి పెట్టాల్సిందేనని రైల్వే వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇది ఎంపీల వల్ల సాధ్యం కావడం లేదని ముఖ్యమంత్రి స్థాయి నాయకులే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.