దసరా నాటికి రైల్వే జోన్ ఆపరేషన్
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:08 AM
విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఈ ఏడాది విజయదశమి (అక్టోబరు 2) నుంచి ఆపరేషన్లోకి తీసుకు రావాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ శ్రీభరత్ కోరారు.
రైల్వే మంత్రిని కోరిన ఎంపీ శ్రీభరత్
విశాఖకు మూడు రైళ్లు కేటాయించాలని వినతి
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఈ ఏడాది విజయదశమి (అక్టోబరు 2) నుంచి ఆపరేషన్లోకి తీసుకు రావాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ శ్రీభరత్ కోరారు. ఢిల్లీలో గురువారం మంత్రిని కలిసి త్వరగా గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలన్నారు. విశాఖ నుంచి మూడు కీలక రైళ్లు అవసరమని వివరించారు. తిరుపతికి రోజువారీ ఎక్స్ప్రెస్ రైలు, బెంగళూరుకు సాయంత్రం బయలుదేరేలా వందేభారత్ స్లీపర్ రైలు, విజయవాడ, గుంటూరు మీదుగా హైదరాబాద్కు రాత్రిపూట ఎక్స్ప్రెస్ రైలు వేయాలని కోరారు. వీటి వల్ల అనేక జిల్లాలకు కనెక్టివిటీ లభిస్తుందన్నారు.
18న హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభం
అదేరోజు కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ఆర్కే బీచ్రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్ సమీపాన వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన యుహెచ్-3హెచ్ హెలికాప్టర్ మ్యూజియాన్ని ఈ నెల 18వ తేదీన ప్రారంభించనున్నట్టు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కైలాసగిరిపై రూ.1.5 కోట్లతో చేపట్టనున్న త్రిశూల్ ప్రాజెక్టుకు కూడా అదేరోజు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. దీనిని ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది రాత్రిపూట వెలుగుతుందని, నగరంలో ఎక్కడి నుంచైనా కనిపిస్తుందన్నారు.