3,114 కుక్కలకు రేబిస్ టీకాలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:46 PM
అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో ఆదివారం 3,114 కుక్కలకు రేబిస్ టీకాలను వేసినట్టు జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్.ఎల్.రాజా రవికుమార్ తెలిపారు.
పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రాజా రవికుమార్
పాడేరురూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో ఆదివారం 3,114 కుక్కలకు రేబిస్ టీకాలను వేసినట్టు జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్.ఎల్.రాజా రవికుమార్ తెలిపారు. అంతర్జాతీయ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక జిల్లా ప్రాంతీయ పశు వైద్యశాలలో కుక్కలకు రేబిస్ టీకాల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుక్కలను పెంచుకొనే యజమానులు వాటికి వచ్చే వ్యాధులను నివారించుకొనేందుకు తగిన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో పశువైద్య కేంద్రాల్లో 16 వేల పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తొలి రోజు ఆదివారం 3,114 కుక్కలకు రేబిస్ టీకాలు ఉచితంగా వేశామన్నారు. పాడేరు మండలంలో 138 పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలను వేశామన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్.పి.వేణుమాదవ్, లైవ్ స్టాక్ అధికారి సురేష్, ఏహెచ్ఏలు శ్రీను, కోటి, ఉమ, రామకృష్ణ, చంద్రమోహన్, బాబూరావు పాల్గొన్నారు.