గిరిజనుల హక్కుల పరిక్షణ బాధ్యత అందరిదీ
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:57 PM
గిరిజనుల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ఎస్.సన్యాసినాయుడు అన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి ఆర్ఎస్.సన్యాసినాయుడు
గిరిజన యువత, పారా లీగల్ వలంటీర్లకు
న్యాయ సేవలపై శిక్షణ
పాడేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ఎస్.సన్యాసినాయుడు అన్నారు. స్థానిక కాఫీహౌస్లో గిరిజన యువత, పారాలీగల్ వలంటీర్లకు న్యాయ సేవలపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రత్యేకత ఉందని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే గ్రామాల్లో ఉండే గిరిజన యువత, పారాలీగల్ వలంటీర్లు, స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా గిరిజనులకు న్యాయ సేవలందించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా గిరిజనులకు ఉచిత న్యాయ సేవలందిస్తున్నారని తెలిపారు. దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ... గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే రాజ్యాంగంలో ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. జిల్లా ఎస్పీ అమిత్బర్దార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు న్యాయ సేవలందిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ మాట్లాడుతూ.. న్యాయ సేవలపై శిక్షణ పొందిన వారు గ్రామాల్లో మరికొందరికీ వాటిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సబ్కలెక్టర్ శౌర్యమన్పటేల్, మాస్టర్ ట్రైనర్ ఆర్.శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, డీఈవో పి.బ్రహ్మజీరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె.కవిత, కార్మిక శాఖాధికారి సుజాత, న్యాయవాదులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.