Share News

ఆశాజనకంగా అవకాడోపై పరిశోధనలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:08 PM

స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో అవకాడోపై నిర్వహిస్తున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆశాజనకంగా అవకాడోపై పరిశోధనలు
పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న అవకాడో మొక్కలు

గిరిజన ప్రాంతానికి అనువైన రకాలపై అధ్యయనం

హెచ్‌ఆర్‌యూలో ఆరు దేశ, విదేశీ రకాల ప్రయోగాత్మక సాగు

కర్ణాటక నుంచి మరో మూడు రకాలు దిగుమతి

చింతపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో అవకాడోపై నిర్వహిస్తున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసేందుకు రెండేళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపడుతున్నారు. బెంగళూరు నుంచి ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలను దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాణ్యత, దిగుబడి, పోషక విలువల ఆధారంగా గిరిజన ప్రాంతానికి అనువైన మేలిజాతి రకాలను ఎంపిక చేసేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేయనున్నారు. మరో మూడు రకాలను కర్ణాటక నుంచి ఈ ఏడాది దిగుమతి చేసుకోనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

గిరిజన ప్రాంతానికి 2004లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు అవకాడోను రైతులకు పరిచయం చేశారు. కాఫీ పంటకు నీడ కోసమని అవకాడో మొక్కలను చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీలో కొంత మంది రైతులకు మొక్కలను పంపిణీ చేశారు. అవకాడో మొక్కలపై సరైన అవగాహన లేకపోయినా, కాఫీ బోర్డు అధికారుల ప్రోత్సాహంతో కాఫీ పంటకు నీడనిచ్చేందుకు రైతులు నాటుకున్నారు. కొత్తరకం పండ్లు కాస్తాయనే భావనతో రైతులు ఒక్కొక్క మొక్కను రూ.25 ధరకు కొనుగోలు చేసుకుని కాఫీ తోటల్లో నాట్లు వేసుకున్నారు. నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై పండ్ల దిగుబడినిస్తున్నాయి. అవకాడో పండ్లకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ తెలియక సుదీర్ఘకాలంగా రైతులు పండ్లను విక్రయించలేదు. చెట్లకు కాసిన కాయలను రైతులు పట్టించుకోకపోవడం వలన నిరుపయోగంగా నేలరాలిపోయేవి. ఐదేళ్ల కిందట ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అవకాడో వృక్షాలు, దిగుబడిని పరిశీలించి పండ్ల విశిష్టతపై రైతులకు అవగాహన కల్పించారు. దీంతో రైతులు మార్కెటింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం సీజన్‌లో వర్తకులు గ్రామాలకు వచ్చి అవకాడో కాయలను కొనుగోలు చేస్తున్నారు. గొందిపాకలు గ్రామంలో రైతుల సాగులో ఉన్న అవకాడో మొక్కలు ఏపుగా పెరగడం, దిగుబడులు ఆశాజనంగా ఉండడంతో గిరిజన ప్రాంతంలో సాగును శాస్త్రవేత్తలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కొంత మంది రైతులు వ్యక్తిగతంగా అవకాడో నాట్లు వేసుకోగా, రెండేళ్లుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉచితంగా అవకాడో మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ మొక్కలు మరో మూడేళ్లకు దిగుబడులు ఇవ్వనున్నాయి.

సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలం

జిల్లాలోని గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు అవకాడో సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవకాడో సాగుకు 15- 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. 1200-1600 మిల్లీమీటర్ల వర్షపాతంతో పాటు సముద్రమట్టానికి 800- 1600 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఈ వాతావరణం గిరిజన ప్రాంతంలో ఉంది. వేసవిలోనూ 25-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షపాతం ఏడాదికి 1350-1650 మిల్లీమీటర్లు నమోదవుతుంది. ఈ మేరకు అవకాడో సాగుకు గిరిజన ప్రాంత వాతావరణం అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఆరు రకాలపై అధ్యయనం

ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు ఆరు దేశ, విదేశీ రకాల మొక్కలపై అధ్యయనం ప్రారంభించారు. గత ఏడాది విదేశీ రకాలపైన టీకేడీ-1, హాస్‌ మొక్కల నాట్లు వేశారు. ఈ ఏడాది పింకర్టన్‌, ఫ్యూర్ట్‌, రీడ్‌ విదేశీ రకాలతో పాటు ఈట్టినింగ్‌ దేశీయ రకం మొక్కల నాట్లు వేశారు. ప్రస్తుతం పరిశోధన స్థానంలో ఎకరం విస్తీర్ణంలో ఐదు విదేశీ, ఒక దేశీయ రకం మొక్కలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ ఆరు రకాల్లో దిగుబడి, పండ్ల నాణ్యత, పోషక విలువల ఆధారంగా గిరిజన ప్రాంతానికి అనువైన మేలిజాతి రకం మొక్కలను ఎంపిక చేయనున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:08 PM