ఎలమంచిలి మునిసిపాలిటీలో వేడెక్కిన రాజకీయం
ABN , Publish Date - May 11 , 2025 | 12:55 AM
ఎలమంచిలి మునిసిపాలిటీలో మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. వైస్చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ నాయకులు, అవిశ్వాస తీర్మానం నెగ్గేలా కూటమి నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లను కూటమి నేతలు తమిళనాడు రాష్ట్రం ఊటీ తరలించగా, నోటీసుపై సంతకాలు చేయని కౌన్సిలర్లలో కొంతమంది మందిని వైసీపీ నాయకులు చెన్నై పంపారు. అవిశ్వాస నోటీసుపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగే వరకు కౌన్సిలర్లు ఆయా ప్రాంతాల్లోని శిబిరాల్లోనే వుంటారని సమాచారం.
వైస్చైర్మన్ పదవులను ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఇరువర్గాలు
కౌన్సిర్లు జారిపోకుండా శిబిరాలకు తరలింపు
12 మందితో ఊటీ వెళ్లిన చైర్పర్సన్ వర్గీయులు
రంగంలోకి దిగిన వైసీపీ పెద్దలు
ఆరుగురు కౌన్సిలర్లు చైన్నైకి తరలింపు
అవిశ్వాసంపై ఎవరి ధీమా వారిది
ఎలమంచిలి, మే 10 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీలో మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. వైస్చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ నాయకులు, అవిశ్వాస తీర్మానం నెగ్గేలా కూటమి నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన కౌన్సిలర్లను కూటమి నేతలు తమిళనాడు రాష్ట్రం ఊటీ తరలించగా, నోటీసుపై సంతకాలు చేయని కౌన్సిలర్లలో కొంతమంది మందిని వైసీపీ నాయకులు చెన్నై పంపారు. అవిశ్వాస నోటీసుపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగే వరకు కౌన్సిలర్లు ఆయా ప్రాంతాల్లోని శిబిరాల్లోనే వుంటారని సమాచారం.
ఎలమంచిలి మునిసిపల్ వైస్చైర్మన్లు బెజవాడ వెంకట గోవిందరాజు నాగేశ్వరరావు, ఆర్రెపు నాగ త్రినాఽథ ఈశ్వర గుప్తాలపై అవిశ్వాసం ప్రకటిస్తూ మునిసిపల్ అధికారులకు గురువారం నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుపై పిల్లా రమాకుమారితో సహా మొత్తం 16 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. దీంతో వైస్చైర్మన్లను పదవుల నుంచి దించేయాలని చైర్పర్సన్ వర్గీయులు, అవిశ్వాస తీర్మానం ఎలాగైనా వీగిపోయేలా చేయాలని వైసీపీ నాయకులు గట్టి పట్టుదలతో వున్నారు. తమ సభ్యులను కాపాడుకునేందుకు ఇరుపక్షాల వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. తొలుత చైర్పర్సన్ వర్గీయులు.. అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసిన 15 మందిని ఊటీ తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక బస్సులో బయలుదేరే సమయంలో వీరిలో ముగ్గురు కౌన్సిలర్లు ఏదో సాకు చెప్పి, ఊటీ వెళ్లకుండా జారుకున్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన ముఖ్య నేతలతోపాటు, కొందరు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, యూవీ రమణమర్తిరాజు(కన్నబాబురాజు) సమావేశమయ్యారు. చైర్పర్సన్ రమాకుమారిని పదవి నుంచి దించేయడానికి సరిపడ బలం వున్నప్పటికీ.. అతిధీమాతో అవకాశాన్ని చేజార్చుకున్నామని, వైస్చైర్మన్ల పదవులను కాపాడుకునే విషయంలో అలా జరుగకూడదని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేయని కౌన్సిలర్లలో ఆరుగురిని చెన్నై తరలించినట్టు సమాచారం. సంతకాలు చేసిన వారిలో ముగ్గురితోపాటు మరో ముగ్గురు ఎలమంచిలిలోనే వున్నారు. వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 17 మంది అవసరం. నోటీసుపై సంతకాలు చేసినవారితోపాటు ఎక్స్అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే మద్దతు ఇస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. ఒక్కరు తగ్గినాసరే వీగిపోతుంది. నోటీసుపై సంతకాల చేసిన వారిలో కనీసం ఒక్కరినైనా తమవైపునకు తిప్పుకోవడంతోపాటు తమ శిబిరంలో వున్నవారు జారిపోకుండా చూసుకోవాలని వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా వైస్చైర్మన్ ఆర్రెపు గుప్తా పదవీ కాలం వచ్చే ఆగస్టుతో నాలుగేళ్లు పూర్తవుతుంది. అందువల్ల అవిశ్వాస నోటీసు మరో వైస్చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావుకు మాత్రమే వర్తింస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు.