Share News

పోలీసులు విస్తృత తనిఖీలు

ABN , Publish Date - May 09 , 2025 | 01:34 AM

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తయమ్యారు.

పోలీసులు విస్తృత తనిఖీలు

రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సోదాలు

అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా

జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ

అనకాపల్లి టౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి):

భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తయమ్యారు. జమ్ము, కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకుపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలతో భారతదేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం రాత్రి డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా నాయకత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి అనకాపల్లి రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు. లాడ్జిలు, హోటళ్లల్లో బసచేసిన వారి వివరాలను సేకరించారు. జాతీయ రహదారిపై డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే.. తక్షణమే పోలీసులకు సమాచారమివ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనాల తనిఖీల్లో డీఎసీతోపాటు పట్టణ సీఐ టీవీ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐ డి.ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పాయకరావుపేటలో..

పాయకరావుపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు పాయకరావుపేట పోలీసులు గురువారం రాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ ఆప్పన్న ఆధ్వర్యంలో ఎస్‌ఐ పురుషోత్తం, సిబ్బంది కలిసి పట్టణంలోని లాడ్జిలు, హోటళ్లలో సోదాలు నిర్వహించారు. వీటిల్లో బసచేసిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లగేజీని కూడా తనిఖీ చేశారు. లాడ్జిలో బస చేసే ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకుని, చెక్‌ చేసుకున్న తరువాతే గది అద్దెకు ఇవ్వాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఏమాత్రం అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జాతీయ రహదారిపై పలు కూడళ్లతోపాటు పట్టణంలోయ వివిధ సెంటర్లలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ అప్పన్న మాట్లాడుతూ, ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి దాటే వరకు పాయకరావుపేట పట్టణంతోపాటు గ్రామాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 01:34 AM