పెట్రోల్ బంకు పనులు బంద్
ABN , Publish Date - May 24 , 2025 | 01:04 AM
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ప్రధాన కార్యాలయం స్థలంలో చేపట్టిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు పనులు నిలిచిపోయాయి. చుట్టూ నివాస గృహాలు, హోటళ్లు, క్రీడా మైదానం, రావు గోపాలరావు కళాక్షేత్రం వంటివి వుండడం, పలువురు స్థానికులు అభ్యంతరం చెప్పడంతో పెట్రోల్ బంకు విషయంలో ముందుకు వెళ్లకూడదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
డీసీఎంఎస్ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణం మొదలు
చుట్టూ ఇళ్లు, హోటళ్లు, క్రీడామైదానం, కళాక్షేత్రం
పెట్రోల్ బంకు వద్దని ఎంపీని కోరిన టీడీపీ నేతలు
అర్ధంతరంగా పనులు నిలుపుదల
అనకాపల్లి టౌన్, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ప్రధాన కార్యాలయం స్థలంలో చేపట్టిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు పనులు నిలిచిపోయాయి. చుట్టూ నివాస గృహాలు, హోటళ్లు, క్రీడా మైదానం, రావు గోపాలరావు కళాక్షేత్రం వంటివి వుండడం, పలువురు స్థానికులు అభ్యంతరం చెప్పడంతో పెట్రోల్ బంకు విషయంలో ముందుకు వెళ్లకూడదని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలని అప్పటి పాలకవర్గం భావించింది. హెచ్పీసీఎల్కు ప్రతిపాదనలు పంపారు. సంస్థ ఉన్నతాధికారులు వచ్చి స్థల పరిశీలన చేశారు. పెట్రోల్ బంకు ఏర్పాటుకు స్థలం అన్ని విధాలా అనుకూలంగా వుందంటూ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి అధికారంలోకి వచ్చింది. గత ఏడాది డిసెంబరులో పెట్రోల్ బంకు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. నేను చదును చేసి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. పెట్రోల్, డీజిల్ నిల్వ చేసే ట్యాంకుల కోసం భారీ గోతులు తీసి, చుట్టూ గోడలు నిర్మించారు. అయితే కూటమి నాయకులు పెట్రోల్ బంకు ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. చుట్టూ నివాస గృహాలు, హోటళ్లు, క్రీడా మైదానం, రావు గోపాలరావు కళాక్షేత్రం వున్నాయి. పెట్రోల్ బంకు వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అందువల్ల నిర్మాణ పనులను నిలిపివేయించాలని ఈ ఏడాది జనవరిలో టీడీపీ సీనియర్ నాయకులు, స్థానిక ఎంపీ సీఎం రమేశ్ను కలిసి కోరినట్టు తెలిసింది. ఈ కారణంగానే పనులు ఆపేశారని సమాచారం. డీసీఎంఎస్ నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత పెట్రోల్ బంకు ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుందని డీసీఎంఎస్ అధికారులు చెబుతున్నారు.