ప్చ్...
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:28 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలుచేసిన జీఎస్టీ నూతన శ్లాబుల విధానం జిల్లాలో తొలిరోజు పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
జీఎస్టీపై వినియోగదారుల పెదవి విరుపు
జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకాని కొత్త శ్లాబులు
కేంద్రం ఆదేశించినా పట్టించుకోని వ్యాపారులు
పాత ధరలనే వసూలు చేసిన వైనం
నిత్యావసర సరకుల ధరల్లో ఎటువంటి మార్పూ లేదు
ఎలక్ర్టికల్ వస్తువులు, ఫుట్వేర్, కార్లు, బైకుల రేట్లు మాత్రం తగ్గింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలుచేసిన జీఎస్టీ నూతన శ్లాబుల విధానం జిల్లాలో తొలిరోజు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇప్పటివరకూ అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబుల స్థానంలో, కేవలం 5, 18 శాతం శ్లాబులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నుంచి కొత్త శ్లాబులను అనుసరించి విక్రయాలు సాగించాలని ఆదేశించింది. అయితే జిల్లాలో అనేక వస్తువుల ధరలను తగ్గించేందుకు వ్యాపారులు ఇష్టపడలేదు.
ముఖ్యంగా నిత్యావసర సరకులు, మందులు, ఫుట్వేర్, వస్ర్తాలపై నూతన జీఎస్టీని అనుసరించి ధరలను తగ్గించాల్సి ఉండగా, వ్యాపారులు పట్టనట్టు వ్యవహరించారు. వినియోగదారులు ప్రశ్నిస్తే పూర్తిస్థాయిలో సమాచారం రాలేదని వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తాము జీఎస్టీ చెల్లించి కొనుగోలు చేసిన సరకులను తగ్గించి అమ్మడం సాధ్యం కాదన్నారు. కాగా ఎలక్ర్టికల్ వస్తువులు, కార్లు, బైక్లపై తగ్గిన శ్లాబులు అమల్లోకి వచ్చాయి. వాటికి దసరా ఆఫర్లు తోడవ్వడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడ్డారు.
తగ్గాల్సిన వస్తువులు ఇవే..
మిల్క్, చీజ్, పిజ్జా, బ్రెడ్, చపాతీ, రోటీ, కొన్ని రకాల మందులు, నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రయాన్స్ వంటివి 12 శాతం శ్లాబు నుంచి జీరో శ్లాబులోకి మార్చారు. అంటే వీటిపై జీఎస్టీ వసూలు చేయకూడదు. అలాగే కండెన్స్డ్ మిల్క్, బటర్, నెయ్యి, చీజ్, రూ.2,500 కంటే తక్కువ ధర గల ఫుట్వేర్, వస్ర్తాలు, కాటన్, జ్యూట్ హ్యాండ్బ్యాగ్స్, కొన్నిరకాల ఫర్నిచర్, కిరోసిస్ స్టవ్, లాంతర్లు, డ్రైఫూట్స్, డయాబెటిక్ ఫుడ్స్, వ్యవసాయ యంత్రాలు, సౌరశక్తి పరికరాలు 12 శాతం నుంచి ఐదు శాతం శ్లాబ్లోకి మార్చారు. టాల్కమ్ పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్, చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్, కాఫీ, టీ ఎక్స్ట్రాక్ట్స్, ఐస్క్రీమ్, మినరల్ వాటర్ కూడా ఐదు శాతం శ్లాబులోకి వచ్చాయి. ఎయిర్ కండిషన్లు, డిష్, వాషింగ్ మెషీన్లు, 1200 సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల పెట్రోల్, 1500 సీసీ కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం గల డీజిల్ వాహనాలు 28 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ శ్లాబులోకి మారాయి.
తగ్గింపు వీటికే పరిమితం
తగ్గిన జీఎస్టీ శ్లాబులను జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే అమలుచేశారు. మిల్క్, చీజ్, నెయ్యిలపై తగ్గింపు ధరలు అందుబాటులోకి వచ్చాయి. పాలు (లీటరు)పై రూ.3 వరకు తగ్గగా, 500 గ్రాముల నెయ్యిని కంపెనీని బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించారు. పన్నీర్ ధర కిలోకు రూ.20 నుంచి రూ.25 వరకు తగ్గింది. మిల్క్ షేక్లు, ఫ్లమ్ కేక్స్పై రెండు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింది. కాగా మరికొన్ని కంపెనీలు పాత ధరలకే విక్రయిస్తున్నాయి. 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో కార్లు, బైక్ల ధరలు దిగి వచ్చాయి. కంపెనీ ధరను బట్టి కనిష్ఠంగా రూ.ఆరు వేల నుంచి రూ.15 వేలు వరకు తగ్గింది. కార్ల ఽధరలు భారీగా తగ్గాయి. ఒక్కో కారుపై రూ.60 వేల నుంచి రూ.1.1 లక్షల వరకు తగ్గినట్టు షోరూమ్ యజమానులు చెబుతున్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా రేట్లు తగ్గించాయి. ఇద్దరు పిల్లలున్న కుటుంబానికి (వయసును బట్టి) రూ.10 లక్షల పాలసీకి ఇప్పటివరకూ రూ.24 వేల నుంచి రూ.28 వేల వరకు వసూలు చేస్తుండగా, దీనిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడంతో రూ.19 వేల నుంచి రూ.20 వేల మధ్య అందుబాటులోకి వచ్చాయి. ఇక ఏసీ, డిష్ వాషర్, టీవీలు 28 శాతం నుంచి 18 శాతం శ్లాబుల్లోకి మార్చడంతో ధరలు తగ్గాయి. సామర్థ్యాన్ని బట్టి ఏసీపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు, డిష్ వాషర్పై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు, టీవీలపై రూ.4 వేల నుంచి రూ.పది వేలు తగ్గించి విక్రయిస్తున్నారు.
తగ్గని వస్తువులు ఇవే..
జీఎస్టీ శ్లాబులు మేరకు ధరలను తగ్గించి విక్రయించాలని కేంద్రం ఆదేశించినప్పటికీ అనేక మంది వ్యాపారులు పట్టించుకోలేదు. పౌడర్, షాంపూ, హెయిర్ఆయిల్, టూత్పేస్ట్, చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్, కాఫీ, టీ ఎక్స్ట్రాక్ట్స్, ఐస్క్రీమ్, మినరల్ వాటర్, మెడిసిన్స్ ధరలు తగ్గలేదు. వస్ర్తాలు, ఫుట్వేర్, మందులకు పాత ధరలే వసూలు చేశారు. అయితే బిల్లులో తగ్గిన జీఎస్టీలను చూపిస్తూ డిస్కౌంట్ రేట్లను పెంచి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా తాము ఇప్పటికే జీఎస్టీ చెల్లించి సరకులు కొనుగోలు చేశామని, వాటిని తగ్గించి విక్రయిస్తే నష్టపోతామని కొందరు వ్యాపారులు...వినియోగదారులతో వాదనకు దిగారు. ఆయా శ్లాబులకు అనుగుణంగా తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఏర్పాటుచేయాలని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మాలా సీతారామన్ ఇచ్చిన ఆదేశాలను ఎక్కడా అమలు చేయడం లేదు. కొద్దిచోట్ల మాత్రం ‘తగ్గించిన జీఎస్టీ రేట్లు వర్తింపజేస్తున్నాము’ అంటూ బోర్డులు పెట్టారు తప్ప ధరల వివరాలేవీ కనిపించలేదు.
పెద్దగా మార్పేమీ లేదు
- తగ్గిన జీఎస్టీకి తగ్గట్టుగా ఆఫర్లు కుదింపు
మద్దిలపాలెం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
కేంద్రం వస్తు సేవల పన్ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆదివారం ధరలకు, సోమవారం ధరలకు పెద్ద తేడా కనిపించలేదు. తొంభై శాతానికిపైగా నిత్యావసర వస్తువుల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నగరంలోని డిపార్టుమెంట్ స్టోర్లు, మార్ట్లు ఎంఆర్పీపై 3 నుంచి 40 శాతం వరకూ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఉదాహరణకు ఒక మార్ట్లో లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ ఎంఆర్పీ రూ.173 ఉంటే 25 శాతం డిస్కౌంట్తో రూ.148కు విక్రయిస్తున్నారు. ఆదివారం గ్రాస్ అమౌంట్ రూ.130.24+ జీఎస్టీ రూ.17.76 (12 శాతం) కలిపి రూ.148 బిల్లు చేశారు. కొత్త జీఎస్టీ అమలుతో సోమవారం అదే ఆయిల్ ఎంఆర్పీపై 20 శాతం డిస్కౌంట్ సేల్ పెట్టి గ్రాస్ అమౌంట్ రూ.140.6 ప్లస్ జీఎస్టీ రూ.7.4 కలిపి రూ.148 బిల్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ ప్రకారం డిపార్టుమెంట్ స్టోర్లు కూడా డిస్కౌంట్ తగ్గించి 21వ తేదీ వరకు ఉన్న ధరలకే సర్దుబాటు చేస్తున్నాయి. అందువల్ల నిత్యావసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇక వీధుల్లో కిరాణా దుకాణాల్లో అయితే జీఎస్టీతో సంబంధమే లేదు. అక్కడ బిల్లులు ఏమీ ఉండవు. దుకాణదారులు నిర్ణయించుకున్న ధరకు వినియోగదార్లు కొనుగోలు చేసుకోవాల్సిందే.