రెండు కంపెనీలకు పీసీబీ నోటీసులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:19 AM
జిల్లాలో కాలుష్యానికి కారణమవుతున్న రెండు కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీచేసింది.
పర్యావరణ పరిహారం కింద రూ.కోటి చొప్పున జరిమానా
31వ తేదీ వరకు కొనసాగనున్న తనిఖీలు
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కాలుష్యానికి కారణమవుతున్న రెండు కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీచేసింది. శనివారం పీసీబీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి విశాఖ పోర్టు, వైజాగ్ సీ పోర్టు, ఆర్సెల్లార్ మిట్టల్, ఎస్సార్ టెర్మినల్, వైజాగ్ జనరల్ కార్గో పరిధిలోని బెర్తులు, స్టాకు యార్డులు, కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనలకు పాల్పడిన రెండు కంపెనీలకు నోటీసులు జారీచేసి పర్యావరణ పరిహారం కింద రూ.కోటి చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు. ఇంకా టార్పాలిన్లు లేకుండా సరుకు రవాణా చేస్తున్న 12 వాహనాలకు జరిమానా విధించారు. జీవీఎంసీ పరిధిలో అధికారులు తనిఖీలు నిర్వహించి 48 చోట్ల ఉల్లంఘనలు గుర్తించి 39 కేసులు నమోదుచేశారు. జీవీఎంసీ ఇంజనీర్లు 21 వాహనాలను తనిఖీ చేశారు. కాగా కాలుష్య నియంత్రణలో భాగంగా ఈనెల 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ పరిశ్రమలు, వాహనాలను తనిఖీలు నిర్వహిస్తామని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు.