రాంకీ యాజమాన్యంపై పీసీబీ చైర్మన్ ఆగ్రహం
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:27 AM
ఫార్మా ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య, రాంకీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై అసహనం
పరవాడ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఫార్మా ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య, రాంకీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఫార్మాసిటీలో రాంకీకి చెందిన కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీడబ్ల్యూఎంపీ), కోస్టల్ ఎన్విరాన్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. సీడబ్ల్యూఎంపీ షెడ్ల వెనుక ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా వందల టన్నుల ఘన వ్యర్థాలు నిల్వ ఉండడంపై ఆయన మండిపడ్డారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు. లోపాలను వెంటనే సరి చేసుకోవాలని సూచించారు. ఫార్మా వ్యర్థాలతో కలుషితంగా మారిన పరవాడ ఉరచెరువు, మల్లోడి వాగు, పరవాడ పెద్ద చెరువును సందర్శించారు. ఆయన వెంట పీసీబీ ఆర్డీ సుదర్శన్, ఈఈ ముకుందరావు, సిబ్బంది వున్నారు.