పప్పుశెట్టిపాలెం సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:54 AM
మండలంలోని పప్పుశెట్టిపాలెం పంచాయతీ సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మి చెక్ పవర్ను జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి రద్దు చేశారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి ఉత్తర్వులు చేరాయి. దీనికి సంబంధించి వివరాలిలా వున్నాయి.
దుర్వినియోగం చేసిన రూ.2.94 లక్షలు రికవరీకి ఆదేశాలు
గొలుగొండ, ఏప్రిల్ 24 (ఆంరఽధజ్యోతి): మండలంలోని పప్పుశెట్టిపాలెం పంచాయతీ సర్పంచ్ మాకిరెడ్డి విజయలక్ష్మి చెక్ పవర్ను జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి రద్దు చేశారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి ఉత్తర్వులు చేరాయి. దీనికి సంబంధించి వివరాలిలా వున్నాయి. పప్పుశెట్టిపాలెం పంచాయతీలోని జమ్మదేవిపేటలో సామాజిక భవన నిర్మాణానికి అయిన వ్యయంలో కొంతసొమ్మును ప్రజల చందాల రూపంలో ఇచ్చారు. అయితే సర్పంచ్ బిల్లులు పెట్టుకుని రూ.2.94 లక్షలు స్వాహా చేశారంటూ వార్డుమెంబర్లు బెల్లపు కొండలరావు, మాకిరెడ్డి వరహాలబాబు, జమ్మదేవిపేట గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఇన్చార్జి ఈవోపీఆర్డీ, పలుగ్రామాల కార్యదర్శులు జమ్మదేవిపేట వచ్చి విచారణ చేపట్టారు. సామాజిక భవనం పునాదుల వరకు గ్రామస్థులు చందాలు వేసుకుని నిర్మించినట్టు విచారణలో తేలింది. సామాజిక భవన నిర్మాణానికి రూ.4.8 లక్షలను పంచాయతీ సాధారణ నిధుల నుంచి డ్రా చేసినట్టు నిర్ధారించారు. అనంతరం సామాజిక భవన నిర్మాణంలో రూ.2.94 లక్షలు దుర్వినియోగమైనట్టు నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందించారు. దీంతో సర్పంచ్ విజయలక్ష్మి చెక్పవర్ రదుచేసి, దుర్వినియోగం చేసిన నిధులను ఆమె నుంచి రికవరీ చేయాలని ఎంపీడీవోను డీపీవో ఆదేశించారు.