అదుపుతప్పిన లారీ
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:00 AM
గాజువాక నుంచి పెదగంట్యాడ వైపు వెళుతున్న భారీ ఇసుక లారీ ఒకటి శనివారం ఉదయం వినాయకనగర్ వుడా కాలనీ రోడ్డులో అదుపుతప్పి కొబ్బరి బొండాల దుకాణంలోకి దూసుకుపోవడంతో ఒక మహిళ మృతిచెందగా, ఆమె మనుమడు తీవ్రంగా గాయపడ్డాడు.
కొబ్బరి బొండాల దుకాణంలోకి దూసుకువెళ్లడంతో మహిళ మృతి
ఐదేళ్ల బాలుడికి తీవ్రగాయాలు
గాజువాక, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి):
గాజువాక నుంచి పెదగంట్యాడ వైపు వెళుతున్న భారీ ఇసుక లారీ ఒకటి శనివారం ఉదయం వినాయకనగర్ వుడా కాలనీ రోడ్డులో అదుపుతప్పి కొబ్బరి బొండాల దుకాణంలోకి దూసుకుపోవడంతో ఒక మహిళ మృతిచెందగా, ఆమె మనుమడు తీవ్రంగా గాయపడ్డాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వియ్యపువానిపాలెంలో వియ్యపు అప్పయ్యమ్మ (55) తన కుమార్తెతో నివాసం ఉంటుంది. ఇంటి సమీపంలో కొబ్బరి బొండాల దుకాణం నిర్వహిస్తోంది. శనివారం తన మనుమడు సాకేత్ (5)ను తీసుకుని దుకాణం వద్దకు వచ్చింది. అదే సమయంలో ఇసుక లారీ దూసుకురావడంతో అప్పయ్యమ్మ మృతిచెందగా, సాకేత్ గాయపడ్డాడు. లారీ డ్రైవర్ బాలగోవింద్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తరువాత అక్కడ నుంచి పరారై న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రమాద స్థలికి స్థానికులు భారీగా చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేదని ఆందోళనకు దిగారు. లారీ యజమానితో చర్చించి న్యాయం చేస్తామని పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. న్యూపోర్టు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.