రోడ్డు మధ్యలో నిలిచిన ఆయిల్ ట్యాంకర్
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:27 PM
జీకేవీధి మండలం సీలేరు జలవిద్యుత్ కేంద్రం సమీపంలోని యూటర్న్ వద్ద ఆదివారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నిలిచిపోవడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
మూడు గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్
పోలీసుల చొరవతో రాకపోకలు పునరుద్ధరణ
సీలేరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరు జలవిద్యుత్ కేంద్రం సమీపంలోని యూటర్న్ వద్ద ఆదివారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ నిలిచిపోవడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. రాజమహేంద్రవరం నుంచి సీలేరుకు డీజిల్ తీసుకు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఉదయం 11 గంటల సమయంలో జల విద్యుత్ కేంద్రం వద్ద యూటర్న్కు వచ్చే సరికి గేర్బాక్సు ఊడిపోవడంతో రహదారి మధ్యలో ఆగిపోయింది. దీంతో జైపూర్ నుంచి భద్రాచలం వెళ్లే ఒడిశా ఆర్టీసీ బస్సుతో పాటు ప్రైవేటు వ్యాన్లు, ఇతర వాహనాలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిచిపోయాయి. దీని వలన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు సీలేరు ఎస్ఐ యాసిన్కు సమాచారం ఇవ్వడంతో కూలీలను ఏర్పాటు చేసి రాకపోకలకు వీలుగా రహదారి పక్కన చదును చేయడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి.