ఆయిల్పామ్ సాగు భళా
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:45 AM
జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం ఈ పంట సాగుకు మొక్కలతో పాటు సబ్సిడీని కూడా ఇస్తుండడంతో దీని పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండడం, విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు.
- జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
- తక్కువ పెట్టుబడితో అధిక లాభం
- ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతుల ఆసక్తి
కోటవురట్ల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం ఈ పంట సాగుకు మొక్కలతో పాటు సబ్సిడీని కూడా ఇస్తుండడంతో దీని పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండడం, విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్పామ్ సాగుపై ఉద్యానవన శాఖాధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో సుమారు ఐదు వేల హెక్టార్లలో 2,100 మంది రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. కోటవురట్ల మండలం రాజుపేటలో పతాంజలి సంస్థ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. రైతులు ఎకరాకు 53 నుంచి 57 మొక్కల వరకు నాటుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు సబ్సిడీ ఇస్తుండగా, దీనిలో రూ.20 వేలు వరకు డ్రిప్ కోసం వినియోగిస్తున్నారు. మిగతా నగదును నాలుగేళ్ల పాటు సాగు కోసం వెచ్చించనున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,200 ఎకరాలకు అనుమతులు మంజూరుకాగా, 530 ఎకరాల్లో సాగు చేశారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభం
ఆయిల్పామ్ ఐదు సంవత్సరాల నుంచి కాపు ప్రారంభమవుతుందని రైతులు చెబుతున్నారు. ఇరవై ఏళ్ల పాటు కాపు వస్తుందని, కూలీల అవసరం కూడా తక్కువేనని అంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కోసిన వెంటనే 24 గంటల్లో ఫ్యాక్టరీకి తరలించాలి. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.