పీజీఆర్ఎస్కు అధికారులు డుమ్మా
ABN , Publish Date - May 03 , 2025 | 12:59 AM
పీజీఆర్ఎస్కు అధికారులు డుమ్మా
ఫొటో రైటప్: 2పిడిఆర్ 7:
అయోమయంలో ఉద్యోగులు, ప్రజలు
పాడేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ శుక్రవారం అధికారులు నిర్వహించలేదు. వాస్తవానికి ఏదైనా కారణం వల్ల పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దయినా లేదా వాయిదాపడినా.. అధికారులు ముందస్తుగా ప్రకటిస్తారు. కాని ఈ శుక్రవారం డీఎస్సీ సాధన సమితి తలపెట్టిన మన్యం బంద్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ను నిర్వహిస్తారా? లేదా? అన్న దానిపై ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు ఎటువంటి సమాచారం రాలేదు. ‘మన్యం బంద్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నందున కచ్చితంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందని అనధికారికంగా సంకేతాలిచ్చారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించే ఐటీడీఏ మీటింగ్ హాలులో అన్నీ సిద్ధం చేశారు. కానీ ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. వాస్తవానికి ప్రజలు వచ్చినా, రాకపోయినా అధికారులు వచ్చి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా ఆ దిశగా కనీసం ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇదే కార్యక్రమానికి హాజరు కాకుంటే తమకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని, కానీ అధికారులే కార్యక్రమానికి రాలేదని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం కుదరకపోతే రద్దు చేస్తున్నట్టు ముందస్తుగా ప్రకటించి వుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.