6న భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:05 AM
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 6న పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి
ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు
28 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం
విశాఖపట్నం, స్పోర్ట్స్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 6న పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గ్యాలరీల్లో సక్రమంగా లేని సీట్లను తొలగించి కొత్తవి ఏర్పాటుచేస్తున్నారు. అలాగే పిచ్, అవుట్ ఫీల్డ్కు సంబంధించి కొత్తగా చేపట్టాల్సిన పనులు లేకపోయినా, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
28 నుంచి టికెట్ల అమ్మకాలు
భారత్, దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్, సానా సతీష్బాబు తెలిపారు. అమ్మకాలకు 22 వేల టికెట్లు అందుబాటులో ఉంచామని, అన్నీ డిస్ర్టిక్ జొమాటో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో జరుగుతాయని పేర్కొన్నారు. దాదాపు అన్ని టికెట్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉంచిన నేపథ్యంలో గతంలో మాదిరిగా కేంద్రాలు ఏర్పాటుచేసి ఆఫ్లైన్లో అమ్మకాలు చేపట్టే అవకాశాలు లేనట్టే.
టికెట్ ధరలు: రూ.1,200, 2,000, 2,500, 3,000, 3,500, 4,000, 5,000, 10,000, 15,000, 18,000