నేడు ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్ష
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:32 AM
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (ఎన్ఎంఎంఎస్)’ అర్హత పరీక్ష జిల్లాలోని 17 కేంద్రాల్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. ప్రతిభ వుండి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా నవంబరు/ డిసెంబరు నెలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నది.
అనకాపల్లి, నర్సీపట్నంలో 17 కేంద్రాలు
3,994 మంది విద్యార్థులకు హాల్టికెట్లు జారీ
ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష
నర్సీపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ (ఎన్ఎంఎంఎస్)’ అర్హత పరీక్ష జిల్లాలోని 17 కేంద్రాల్లో ఆదివారం నిర్వహిస్తున్నారు. ప్రతిభ వుండి, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏటా నవంబరు/ డిసెంబరు నెలల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్/ ప్లస్2 వరకు ఏటా నిర్ణీత మొత్తంలో నగదు అందిస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హుల ఎంపిక కోసం ఆదివారం అనకాపల్లి, నర్సీపట్నంలో 17 కేంద్రాల్లో ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలోని ఎనిమిది కేంద్రాల్లో 1,918 మంది, అనకాపల్లిలోని తొమ్మిది కేంద్రాల్లో 2,076 మంది.. మొత్తం 3,994 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష వుంటుంది. అర్ధగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.హాల్టికెట్ మీద ఉన్న క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కనిపిస్తుందని తెలిపారు.