జిల్లా అభివృద్ధికి నూతన ప్రణాళికలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:16 AM
జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమంగా నిలపడానికి అధికారులు నూతన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుసేవా కేంద్రాల స్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, డీఆర్డీఏ సహకారంతో కొత్త పాడి యూనిట్లు స్థాపన, ఉద్యానవన పంటల విస్తీర్ణం పెంపు, మత్స్యకారులకు శిక్షణ చేపట్టాలన్నారు. విశాఖ పర్యాటక డెస్టినేషన్గా ఉండాలని, పర్యాటకులు రెండు, మూడు రోజులు ఇక్కడ ఉండేలా అడ్వంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుచేయాలని, మూడు నెలల్లో రెండు క్యారవాన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశాలు
సూపర్ సిక్స్ పథకాల అమలులో సమస్యలు గుర్తించి పరిష్కరించాలి
జిల్లాలో 1,05,000 బంగారు కుటుంబాల గుర్తింపు
ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల కోసం స్థల సేకరణ
రోడ్లపై గుంతలు లేకుండా చూడండి
విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాను అన్ని రంగాల్లో ఉత్తమంగా నిలపడానికి అధికారులు నూతన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుసేవా కేంద్రాల స్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, డీఆర్డీఏ సహకారంతో కొత్త పాడి యూనిట్లు స్థాపన, ఉద్యానవన పంటల విస్తీర్ణం పెంపు, మత్స్యకారులకు శిక్షణ చేపట్టాలన్నారు. విశాఖ పర్యాటక డెస్టినేషన్గా ఉండాలని, పర్యాటకులు రెండు, మూడు రోజులు ఇక్కడ ఉండేలా అడ్వంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుచేయాలని, మూడు నెలల్లో రెండు క్యారవాన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజం కోసం భూములు తీసుకున్నవారు కార్యకలాపాలు ప్రారంభించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్య రంగాలతోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలులో సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం శిక్షణ ఇవ్వడానికి విశాఖ ఐఏఎం ముందుకు వచ్చిందని, స్థానికంగా ఔత్సాహికులను గుర్తించి శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లాలో 1,05,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ఆయా కుటుంబాలను మార్గదర్శకులు ఆదుకునేవిధంగా సచివాలయ స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి ఏమి కావాలో గుర్తించి అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కేవలం డబ్బే కాకుండా వారికి అవసరమైన ఏ సహకారాన్ని అయినా అందించవచ్చన్నారు. ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల కోసం స్థల సేకరణ చర్యలు చేపట్టాలన్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతంలో పక్షులు ఎగురకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ, ఎయిర్పోర్టు, ఇరిగేషన్ అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలన్నారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ పక్కాగా చేపట్టాలన్నారు. వీధి లైట్ల వెలగకపోయినా, విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు. 28.5 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు విరివిగా మొక్కలు నాటాలన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలితాలు ప్రజలకు తెలిసే విధంగా నెలరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, గురువారం ఉదయం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎనిమిది గంటలు నుంచి తొమ్మిది గంటల వరకు ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ పేరుతో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో భవానీ శంకర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.