మాడుగుల మోదకొండమ్మకు నూతన ఆభరణాలు
ABN , Publish Date - May 09 , 2025 | 01:33 AM
మాడుగుల మోదకొండమ్మ అమ్మవారికి నూతనంగా తయారు చేయించిన బంగారం, వెండి ఆభరణాలను గురువారం అలంకరించారు.

27 కిలోల వెండితో కవచం, చేయి తొడుగులు, ఢమరుకం, ఖడ్గం
ఎనిమిది తులాల బంగారంతో శతమానాలు
మాడుగుల, మే 8 (ఆంధ్రజ్యోతి):
మాడుగుల మోదకొండమ్మ అమ్మవారికి నూతనంగా తయారు చేయించిన బంగారం, వెండి ఆభరణాలను గురువారం అలంకరించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన వెండితోపాటు అమ్మవారికి ఉన్న పురాతన వెండి ఆభరణాలు కరిగించి మొత్తం 27 కిలోల వెండితో కొత్తగా కవచం, చేయి తొడుగులు, ఢమరుకం, ఖడ్గం చేయించారు. అదే విధంగా ఎనిమిది తులాల బంగారంతో శతమానాలు చేయించారు. వెండి ఆభరణాల విలువ రూ.33 లక్షలు, బంగారం శతమానం రూ.9 లక్షలు వుంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా మోదకొండమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, తదితరులు దర్శించుకుని పూజలు చేశారు. మాడుగుల పేరుచెబితే మొదటిగా గుర్తుకు వచ్చేది మోదకొండమ్మ అమ్మవారేనని, అందరికీ ఎల్లవేళలా అమ్మవారి ఆశీసులు ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, భీమరశెట్టి పైడయ్యనాయుడు, దేవరాపల్లి శ్రీను, సర్పంచ్ యడ్ల కళావతి, ఎంపీపీ తాళ్లపురెడ్డి రాజారాం, టీడీపీ మండల అధ్యక్షుడు అద్దెపల్లి జగ్గారావు, పుప్పాల లక్ష్మీనారాయణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.