నెట్వర్క్ ఆస్పత్రులు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాల్సిందే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:45 AM
ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు తెలిపారు.
డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే ఫిర్యాదు చేయవచ్చు
డబ్బులు వసూలు చేసే ఆస్పత్రులకు జరిమానా
కుటుంబానికి ఏడాదిలో రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం
‘ఆంధ్రజ్యోతి’తో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు
విశాఖపట్నం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు తెలిపారు. క్యాష్లెస్ వైద్య సేవలు అందించడంలో ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో పథకం అమలు తీరు, నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవల వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ప్రశ్న: నెట్వర్క్ పరిధిలో ఉన్న ఆస్పత్రులు ఎన్ని?
జవాబు: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ పరిధిలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి 108 వరకూ ఉన్నాయి. వీటిలో 63 ప్రైవేటు ఆస్పత్రులు కాగా, 45 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి.
ప్ర: వైద్య సేవలు అందడంలో తలెత్తుతున్న ఇబ్బందులపై ఏమంటారు.?
జ: కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అనేక ఆస్పత్రులు నెట్వర్క్లో ఉండి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించదంటూ డ బ్బులు వసూలు చేస్తున్నాయి. అటువంటి వాటిపై ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఆస్పత్రిలో ఉండగా గానీ, డిశ్చార్జ్ అయిన తరువాత గానీ 104కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటి ఫిర్యాదులపై కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్ర్టిక్ డిసిప్లినరీ కమిటీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకూ అలా డబ్బులు వసూలుచేసిన 17 ఆస్పత్రులకు ఏడు లక్షల రూపాయల వరకు జరిమానా విధించాం. ఈ తరహా ఇబ్బందులు ఉంటే స్థానికంగా ఉండే ఆరోగ్య మిత్రకు కూడా తెలియజేయవచ్చు. ప్రభుత్వం ఆస్పత్రులకు డబ్బులు చెల్లిస్తోంది. కాబట్టి, రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
ప్ర: జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య ఎంత?
జ: జిల్లాలో 4,85,745 కార్డుల్లో సుమారు 12 లక్షల మంది వరకూ సభ్యులు ఉన్నారు. వారితోపాటు ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పథకంలో భాగంగా రెండు లక్షల కుటుంబాలకు, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ కింద మరో వేయి మంది కుటుం బాలకు అందించే వైద్య సేవలను పర్య వేక్షిస్తున్నాం. వీరికి ఏ ఇబ్బందులు ఉన్నా మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
ప్ర: ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు ఎంతమంది?
జ: కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఉచితంగా నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు అందిస్తోంది. ఈ పథకానికి జిల్లాలో 9,11,697 మంది అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటివరకూ 6,95,049 మందికి ఈకేవైసీ పూర్తి చేశాం. కార్డులు పంపిణీ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తిచేస్తాం. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్లో ఉన్న ఆస్పత్రులన్నింటిలోనూ దాదాపు ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఉచిత వైద్య సేవలు అందుతాయి. ఈ పథకంలో భాగంగా ఐదు లక్షల వరకూ ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ కార్డులను అందిస్తున్నాం.
ప్ర: సమస్యలుంటే ఎవరిని సంప్రతించాలి?
జ: ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఎటువంటి సమస్య ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు. ఆరోగ్య మిత్రలు ప్రతిరోజూ బెడ్సైట్ విజట్ చేయాలి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించే బాధ్యత ఆరోగ్య మిత్రలపై ఉంటుంది. నేను కూడా టీమ్తో ప్రతిరోజూ కనీసం మూడు నుంచి ఐదు ఆస్పత్రులు విజిట్ చేస్తుంటా. రోగులతో స్వయంగా మాట్లాడి ఇబ్బందులు తెలుసుకుంటాం. కొన్నిసార్లు డిశ్చార్జ్ అయి వెళ్లిన రోగులతో ఫోన్లో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందాయన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాం.